Ayodhya case:రాజీవ్ ధవన్పై హిందూ సంఘాలు ఫిర్యాదు ఎందుకంటే..?
న్యూఢిల్లీ: బుధవారం రోజున అయోధ్యపై వాదనలు నడుస్తున్న క్రమంలో హిందూ పార్టీల తరపున వాదిస్తున్న లాయర్ వికాస్ సింగ్... రాముడి జన్మస్థలం గురించి వివరిస్తూ ఓ మ్యాప్ను చూపించారు. దీన్ని ముస్లిం పార్టీల తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ రాజీవ్ ధవన్ చించివేశారు. దీనిపై బార్కౌన్సిల్లో హిందూ సంఘం అఖిలభారత హిందూ మహాసభ రాజీవ్ ధవన్పై ఫిర్యాదు చేసింది.
బార్కౌన్సిల్ ఛైర్మెన్కు రాసిన లేఖలో రాజీవ్ ధవన్ విషయంను ప్రస్తావిస్తూ ... ఆయన కోర్టుహాలులో చించివేసిన మ్యాప్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కోర్టుకు జరిగిన అవమానంగా భావించాల్సి ఉంటుందని వెల్లడించింది. వెంటనే బార్ కౌన్సిల్ రాజీవ్ ధవన్పై చర్యలు తీసుకోవాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే అయోధ్య బాబ్రీ మసీదు కేసులో వాదనలు బుధవారంతో ముగిశాయి. వాదనల సందర్భంగా ఇటు ముస్లిం పార్టీలు అటు హిందూ పార్టీల తరపున లాయర్లు భూమి తమకు చెందుతుందంటే తమకు చెందుతుందని వాదనలు వినిపించారు. ఒకానొక సమయంలో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరిలో ఎవరైనా ఒకరు తగ్గకుంటే కోర్టు నుంచి లేచి వెళ్లిపోతామని చెప్పారు. వాదనల సందర్భంగా హిందూ సంఘాలు శ్రీరాముడి జన్మస్థలంకు సంబంధించిన మ్యాప్ ఉన్న పుస్తకంను చివరినిమిషంలో ప్రవేశపెట్టారు. దీనిపై ముస్లిం పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లాయర్ రాజీవ్ ధవన్ ఆ మ్యాప్ ఉన్న పేజీని చించివేశారు.
అలాంటి మ్యాపులు ఆధారాలుగా చెల్లవని ధవన్ కోర్టుకు తెలిపారు. వీరు కోర్టుకు సమర్పిస్తున్న మ్యాప్పై ఏమి చేయాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ను కోరగా అది పనికిరాదనుకుంటే మ్యాప్ను చించివేయొచ్చంటూ ఆదేశించారు. దీంతో రాజీవ్ ధవన్ మ్యాప్ను చించివేశారు. ధవన్ చించివేయడంతో కోర్టుహాలులో కాసేపు హైడ్రామా నడిచింది. అదే సమయంలో ఆ పుస్తకాన్ని తనతో పాటు తీసుకెళ్లి తన రిటైర్మెంట్ తర్వాత చదువుతానని చెప్పారు. ఇక భోజన విరామం తర్వాత మళ్లీ వాదనలు ప్రారంభం కాగా తాను మ్యాప్ను చించివేసిన ఘటన బయట వైరల్ అయ్యిందని తనకు తానే ఆ మ్యాప్ను చించివేసినట్లు ప్రచారం జరుగుతోందని చెప్పగా దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ క్లారిటీ ఇచ్చారు.