జేఎన్యూపై దాడి చేసింది మేమే.. ఇలాంటివి మరిన్ని రిపీట్ అవుతాయి : హిందూ రక్షాదళ్ సంచలన ప్రకటన
Recommended Video
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఆదివారం సాయంత్రం జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్తో పాటు మరో 35మంది వరకు ఈ దాడిలో గాయపడ్డారు. దాడులపై ఏబీవీపీ,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడింది తామే అంటూ రైట్ వింగ్ గ్రూప్ హిందూ రక్షా దళ్ సంచలన ప్రకటన చేసింది.
అలా జరుగుతోందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు : జేఎన్యూ విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్
దాడి మేమే చేశాం : హిందూ రక్షా దళ్
జేఎన్యూలో విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి సంచలన ప్రకటన చేశారు. జేఎన్యూ క్యాంపస్లో సంఘ విద్రోహ,హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే క్యాంపస్లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొరబడి దాడి చేసినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు.
ఇలాంటివి రిపీట్ అవుతాయని వార్నింగ్
జేఎన్యూ క్యాంపస్ కమ్యూనిస్టులకు అడ్డాగా మారిపోయిందని,దాన్ని తాము సహించబోమని భూపేంద్ర తోమర్ అన్నారు. వాళ్లు తమ మతాన్ని,దేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. తమ మతం పట్ల వారి వైఖరి దేశ ద్రోహుల్లా ఉందని ఆరోపించారు. భవిష్యత్లో ఇతర యూనివర్సిటీల్లోనూ ఎవరైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. మరోసారి జేఎన్యూ లాంటి ఘటనలు రిపీట్ అవుతాయని హెచ్చరించారు.
ప్రాణ త్యాగానికైనా సిద్దం
'వాళ్లు మన దేశంలో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ,ఇక్కడే చదువుకుంటూ,దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అందుకే జేఎన్యూపై దాడి చేశాం. ఆ దాడిలో పాల్గొన్నదంతా మా హిందూ రక్షా దళ్ సభ్యులే. దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాం.'అని భూపేంద్ర తోమర్ వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న దర్యాప్తు
పింకీ చౌదరి చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని ప్రభుత్వ అధికారులు తెలిపినట్టుగా ఏఎన్ఐ వెల్లడించింది. మరోవైపు జేఎన్యూ హింసాకాండలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు.. క్యాంపస్లోని వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.