మత విధ్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగం: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అరెస్టుల పర్వం
డెహ్రాడూన్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న వేళ.. అరెస్టులు, పాత కేసుల తవ్వకాల పర్వం తెరమీదికి వచ్చింది. బీజేపీకి రాజీనామా చేసి, సమాజ్వాది పార్టీలో చేరిన ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఏడు సంవత్సరాల కిందటి కేసు తిరగదోడింది. అదే సమయంలో- ఉత్తరాఖండ్లో నిర్వహించిన ధర్మసంసద్లో మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.
హరిద్వార్ ధర్మసంసద్ సదస్సులో మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న యతి నరసింఘానంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా హరిద్వార్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి నరసింఘానంద్
హరిద్వార్లో కిందటి నెల 17 నుంచి 19 వరకు ధర్మసంసద్ పేరుతో నిర్వహించిన సదస్సులో యతి నరసింఘానంద్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 2029లో ముస్లిం ప్రధాన మంత్రి కాబోతోన్నారని జోస్యం చెప్పారు. ముస్లిం ప్రధాని కావడాన్ని అడ్డుకోవడానికి హిందువులు కత్తులు పట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. నరసింఘానంద్ను అరెస్ట్ చేయాలంటూ పలు ఫిర్యాదులు అందాయి. దీనితో ఆయన కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా హరిద్వార్లో ఉన్నట్లు గుర్తించారు. జితేంద్ర త్యాగి అరెస్టును నిరసిస్తూ హరిద్వార్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో జితేంద్ర త్యాగి ఇదివరకే అరెస్ట్ అయ్యారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ధర్మసంసద్ సదస్సు కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. జితేంద్ర త్యాగి, యతి నరసింఘానంద్ అరెస్ట్ కాగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఉత్తరాఖండ్ పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలను సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై 10 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.