షాహీన్బాగ్లో 144 సెక్షన్: పోలీసుల ఒత్తిడి.. హిందూసేన ప్రదర్శన రద్దు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఆందోళనకారులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో షాహీన్ బాగ్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు.
షాహీన్బాగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పెద్ద సంఖ్యలు చేరి సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు.
కాగా, షాహీన్బాగ్ ఆందోళనకారుల్ని రోడ్డుపైనుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మార్చి 1న నిరసన ప్రదర్శన నిర్వహించాలని 'హిందూ సేన' ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తమ ప్రదర్శనను శనివారం ఉపసంహరించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
పోలీసుల ఒత్తిడి వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని హిందుసేన నేతలు చెప్పారు. అలాగే తమ 'హిందూ సేన' జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తాను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అయితే, తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాతే హిందూ సేన తమ ప్రదర్శన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని తెలిపారు. షాహీన్ బాగ్ నిరసనకారులు ర్యాలీ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. అదనపు పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. 42 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో ఇద్దరు పోలీసు అధికారులు కూడా హత్యకు గురికావడం గమనార్హం. 200 మందికిపైగా ప్రజలు గాయాలపాలయ్యారు. గత ఆదివారం ఉదయం నుంచి బుధవారం వరకు ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.