సరికొత్త వివాదం: తాజ్ మహల్ కింద శివాలయం ఉందా!? పూజలూ మొదలెట్టేశారు!
తాజ్మహల్ సందర్శనకు అని చెప్పి వచ్చిన కొంతమంది యువకులు ఆ ప్రాంగణంలో కూర్చొని శివపూజలు మొదలెట్టారు. శివుడ్ని కీర్తిస్తూ పాటలు పాడారు.
ఆగ్రా: తాజ్మహల్ సందర్శనకు అని చెప్పి వచ్చిన కొంతమంది యువకులు ఆ ప్రాంగణంలో కూర్చొని శివపూజలు మొదలెట్టారు. శివుడ్ని కీర్తిస్తూ పాటలు పాడారు. ఇది సందర్శన ప్రాంతమని, పూజలు చేయవద్దని చెప్పిన పోలీసులపై తిరగబడ్డారు.
Recommended Video
పూజ మధ్యలో మమ్మల్ని లేపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నమాజ్ చేసే వారిని ఏమీ అనరుకదా? తాము పూజలు చేస్తే తప్పేమిటని కొందరు యువకులు ప్రశ్నించారు.
అంతేకాదు, అసలు తాజ్ మహల్ సమాధి కాదని, అంతకుముందు అక్కడ శివాలయం ఉందని, దాన్ని కూల్చివేసి షాజహాన్ తాజ్ మహల్ కట్టారని, ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర శివాలయం కట్టాలని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ లాంటివాళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా దీపక్ శర్మ అనే వ్యక్తి నేతృత్వంలో కొంతమంది యువకులు తాజ్ మహల్ సందర్శనకు వచ్చి అక్కడ శివపారాయణం మొదలెట్టారు. పూజలు చేసేవారిని రాష్ట్రీయ స్వాభిమాన్ దళ్, హిందూ యువవాహిని కార్యకర్తలుగా గుర్తించారు.
సీఐఎస్ఎఫ్ దళాలు వారిని అడ్డుకుని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం 'సారీ' చెప్పడంతో పోలీసులు ఆ యువకులను విడిచిపెట్టారు. అంతేకాదు, తాజ్ మహల్ కింద శివాలయం ఉందంటూ వారు వాదిస్తున్నారు.