హిందూజా కుటుంబంలో ఆస్తి తగాదాలు...ఒకే ఒక లేఖ వివాదానికి కారణం..ఏముంది?
డబ్బు ఎంతపనైనా చేస్తుంది. బంధాలను బలపడేలా చేస్తుంది. అదే బంధాలు తెగిపోయేలా కూడా చేయగల సత్తా సామర్థ్యం ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టగలదు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగలదు డబ్బు. అదే సమయంలో అదే కుటుంబాల మధ్య అనుబంధం పెంచగలదు.. అన్నదమ్ములను కూడా కలపగలదు. తాజాగా ప్రపంచపు ధనిక కుటుంబాల్లో ఒకటైన హిందూజా కుటుంబంలో కూడా ఆస్తి తగాదాలు రాజుకున్నట్లు తెలుస్తోంది. 11.2 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించి హిందూజా సోదరులు సంతకం చేసిన ఒక డాక్యుమెంట్ వివాదాలకు కారణమవుతోంది.
ఆస్తి వివాదానికి ఆ డాక్యుమెంట్ కారణం
2014నాటి హిందూజా ఆస్తుల డాక్యుమెంట్ ప్రకారం ఒక సోదరుడి పేరున కలిగి ఉన్న ఆస్తులు మొత్తం మిగతా సోదరులకు కూడా చెందుతాయని రాసి ఉంది. అయితే ప్రతి ఒక్కరు తమ ఎగ్జిక్యూటర్లుగా మరొకరిని నియమించుకోవచ్చనేది కూడా రాసి ఉంది. అయితే ఇంతవరకు బాగున్న స్టోరీ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. హిందూజా సోదరుల్లో పెద్దవాడైన శ్రీచంద్ హిందూజా ఆయన కుమార్తె వినూలు ఈ డాక్యుమెంట్కు విలువ లేకుండా చేయాలని కోరుతున్నారు. అంటే చెల్లుబాటు కాదని డిక్లేర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. యూకేలో నివాసముంటున్న ఈ కుటుంబం అక్కడ లండన్ కోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో సోదరుల మధ్య ఆస్తిగొడవలు కాస్త వెలుగులోకి వచ్చాయి.
హిందూజా బ్యాంక్ పై ముగ్గురు సోదరుల కన్ను
హిందూజా కుటుంబంలో మిగతా ముగ్గురు సోదరులు అంటే గోపిచంద్ , ప్రకాష్, అశోక్లు తమ కుటుంబానికి పెద్ద ఆస్తిగా ఉన్న హిందూజా బ్యాంక్ను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకోసం ఆ డాక్యుమెంట్ను అడ్డంగా పెట్టుకుని ప్రయత్నాలు సాగిస్తున్నారని లండన్ జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ బ్యాంకు శ్రీచంద్ హిందూజా పేరుపై ఉంది. దీంతో ఆగ్రహించిన శ్రీచంద్ కోర్టును ఆశ్రయించారు. తామంతా సంతకం చేసిన డాక్యుమెంట్ చెల్లదని పేర్కొంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ డాక్యుమెంట్ను ఒక వీలునామాగా చూడరాదని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అంతేకాదు 2016లోనే ఆస్తులను సెపరేట్ చేయాలంటూ శ్రీచంద్ న్యాయస్థానాన్ని కోరారని జడ్జి గుర్తు చేశారు.
ఆ డాక్యుమెంట్ రద్దు చేస్తే పరిస్థితి మరోలా..
ఇదిలా ఉంటే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ వివాదం తమ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ముగ్గురు సోదరులు చెప్పారు. అంతేకాదు తమ కుటుంబ విలువలపై కూడా ఎలాంటి ప్రభావం చూపదని చెప్పారు. విలువలు విధానాలే తమ కుటుంబ ఆస్తులని చెప్పుకొచ్చారు. ఆస్తులన్నీ అందరివి అని చెప్పిన హిందూజా సోదరులు అదే సమయంలో ఏదీ ఎవరికీ చెందదని కూడా చెప్పారు.అంతేకాదు కుటుంబ విలువలకే తాము అధికా ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ డాక్యుమెంట్ చెల్లకుండా చేస్తే ఆస్తులన్నీ శ్రీచంద్ కుమార్తెకు బదిలీ అవుతాయని ఆ తర్వాత తన వారసులకు వెళతాయని మిగతా ముగ్గురు హిందూజా సోదరులు ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video
హిందూజా గ్రూప్ చరిత్ర ఇదీ..
ఇక హిందూజా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి. అత్యధిక ఆస్తులు హిందూజా గ్రూప్ నుంచే ఉన్నాయి. వందేళ్లకు పైగా ఆ కుటుంబం పారిశ్రామికంగా రాణిస్తోంది. ఈరోజు ఆర్థిక సంస్థల్లో, మీడియా ఆరోగ్యరంగాల్లో వీరి పెట్టుబడులు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 40 దేశాల్లో విస్తరించి ఉన్నట్లు సమాచారం. ఇక బ్లూంబర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం హిందూజా కుటుంబంకు 11.2 బిలియన్ డాలర్లు మేరా ఆస్తులు కలిగి ఉన్నాయి.