Ayodhya Verdict: ‘ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం’
న్యూఢిల్లీ: చారిత్రక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ తీర్పును వెలువరించారు. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Ayodhya verdict: బాబ్రీ మసీదు-రామజన్మభూమి టైటిల్ సూట్లో కీలక వ్యక్తులు వీరే
స్పష్టం చేసిన సుప్రంకోర్టు
అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. .
మందిరం ఉన్నట్లు నివేదికలు..
నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం..
సుప్రీంకోర్టు తీర్పుపై హిందూ మహాసభ లాయర్ వరుణ్ కుమార్ సిన్హా స్పందించారు. ‘ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది' అని వరుణ్ కుమార్ సిన్హా వ్యాఖ్యానించారు.
తీర్పును గౌరవిస్తాం.. అజ్మీర్ దర్గా
సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ జఫార్యబ్ జిలానీ మాట్లాడుతూ.. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని అన్నారు. అయితే, ఈ తీర్పు తమకు సంతృప్తికరంగా లేదని అన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని.. అంగీకరిస్తామని అజ్మీర్ దర్గా వెల్లడించింది.