భారతీయులు రక్తం మరుగుతోంది...! పాక్ మూల్యం చెల్లించక తప్పదన్న ప్రధాని..!!
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : పుల్వామా దాడితో ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని, దీనికి ప్రతీకారం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ పని ఎవరు చేశారోగానీ చాలా పెద్ద తప్పు చేశారు.. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అని మోదీ అన్నారు. ఈ విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి దాడులతో భారత్ను బలహీనపరచాలని చూస్తున్న పాకిస్థాన్ ఆటలు సాగవని హెచ్చరించారు. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం... ప్రజల రక్తం మరుగుతోంది... మన పొరుగు దేశాన్ని ఇప్పటికే అంతర్జాతీయంగా ఒంటరిని చేశాం. ఇలాంటి ఉగ్రదాడులతో ఇండియాను అస్థిర పరచాలని భావిస్తోంది. కానీ వాళ్ల ఆటలు సాగవు అని మోదీ స్పష్టం చేశారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ చాలా ఆవేశంగా మాట్లాడారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించారు. ఈ దాడిని ఖండించిన అన్ని దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ఈ దాడి వెనుక ఉన్న వాళ్లను కచ్చితంగా శిక్షిస్తాం అని స్పష్టం చేశారు. ఇది భావోద్వేగాలతో కూడిన సమయమని, ఈ దాడిని రాజకీయం చేయొద్దని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. ఐతే భారతీయులను తక్కువ అంచనా వేయొద్దని, ప్రతీకారం తీర్చకుని తీరుతామని హెచ్చరించారు.ఏమరుపాటుగా ఉనప్పుడు దెబ్బతీయండం పిరికి వాడి లక్షణమని, వీరుడు ఎదుగా వచ్చి యుద్దం చేస్తాడని ప్రధాని చెప్పుకొచ్చారు.