హిందుస్తాన్ హిందువులదే: ఆర్ఎస్సెస్ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు.
ఇండోర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు.
ఇండోర్లో శనివారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగింస్తూ.. ఇలా వ్యాఖ్యానించారు. అయితే హిందుస్తాన్లో ఇతర మతస్తులు కూడా జీవించవచ్చని చెప్పారు.
జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్, అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్తాన్ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక్కడ హిందువులు అంటే.. భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు.
పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారసులంతా భారతీయులే. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ చెప్పారు.
భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజం కూడా తనవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు, అభివృద్ధి జరగదని.. మార్పు, అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు.