సీఎం ఇంటిని పేల్చేస్తా: ఇల్లు కాలిన వ్యక్తి ఆవేశం
డెహ్రాడూన్: ప్రమాదవశాత్తు తన ఇల్లు అగ్నిప్రమాదానికి గురి కాగా, ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఇంటిని పేల్చేస్తానంటూ బెదిరింపులకు తెగబడ్డాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గార్వాల్ ప్రాంతంలో చోటు చేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. పౌరీ గార్వాల్ ప్రాంతానికి చెందిన కేశవానంద్(23) లూధియానాలోని ఓ కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు ఆయన ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఇల్లంతా దగ్ధమైపోయింది.
Also Read: ‘రైతులకు ఆత్మహత్యలు చేస్కోవడం ఫ్యాషనైపోయింది'
ఈ ప్రమాదం అనంతరం భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. అటు ఇల్లు లేక ఇటు భార్యలేక కేశవ్ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైన తర్వాత అతనికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని పేల్చేస్తానంటూ సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించాడు. వెంటనే పోలీసులు ఈ ఫోన్కాల్ విషయమై ఆరా తీసి, ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేశవ్ని పట్టుకుని విచారణ మొదలెట్టారు.