పేదరికం నుంచి ప్రధానిగా, క్లారిటీ ఉన్న నేత, దానికి భక్తుడు: నరేంద్ర మోడీపై బరాక్ ఒబామా ప్రశంసలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కురిపించారు. 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పేరుతో ఒబామా ఓ పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. కాగా, 2015లో టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ గురించి పేర్కొన్న అంశాలను కూడా ఒబామా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
Recommended Video
పేదరికం నుంచి ప్రధానిగా మోడీ..
ఒకప్పుడు తండ్రికి సాయం చేసేందుకు, కుటుంబానికి అండగా ఉండేందుకు టీ అమ్మిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు అని మోడీపై ఒబామా కొనియాడారు. భారత చైతన్యశీలతకు, సమర్థతకు పేదరికం నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు.
క్లారిటీ ఉన్న నేత మోడీ..
అంతేగాక, పేదరిక నిర్మూలన, మెరుగైన విద్య, బాలికలు-మహిళల సాధికారత వంటివాటిపై మోడీకి స్పష్టమైన లక్ష్యాలున్నాయని ఒబామా ప్రశంసించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొంటూనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు పాడుపడుతున్నారని వ్యాఖ్యానించారు.
యోగాకు మోడీ భక్తుడు.. ప్రపంచానికి ఆదర్శమని గుర్తించారు
ఇక యోగాకు నరేంద్ర మోడీ భక్తుడని ఒబామా చెప్పుకొచ్చారు. డిజిటల్ ఇండియా కలలను నిజం చేస్తున్నారని తెలిపారు. మోడీ అమెరికా పర్యటన సమయంలో తనతో కలిసి డాక్టర్ మార్టిన్ కింగ్ జూనియర్ స్మారకాన్ని సందర్శించుకున్న సందర్బాన్ని కూడా ఒబామా తన పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. కోట్లాది మంది భారతీయుల సమైక్యత ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని మోడీ గుర్తించారని ఒబామా వెల్లడించారు. నవంబర్ 17న మార్కెట్లోకి రానుంది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.
టీచర్ను ఆకర్షించాలనుకునే విద్యార్థిగా రాహుల్..
మరోవైపు, రాహుల్ గాంధీ గురించి కూడా బరాక్ ఒబామా తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ఒబామా చేసిన వ్యాఖ్యలు రాహుల్ పరువు తీసేలా ఉన్నాయి. టీచర్ దృష్టిలో పడాలనే విద్యార్థిలా రాహుల్ స్వభావం ఉంటుందని అన్నారు. రాహుల్ది ఆరాటమే కానీ, విషయాల పట్ల స్పష్టత, అవగాహన లేదని, ధైర్యం కూడా ఆయనలో కనిపించదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తనను తాను చాలా మెరుగుపర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.