చారిత్రక తగ్గుదల: భారత ఆర్థిక వృద్ధిరేటు 4.5 శాతం తగ్గుదల: ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనా వేసింది. దీనిని 'చారిత్రక తగ్గుదల'గా అభివర్ణించడం గమనార్హం.
అయితే, 2021లోపు 6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని స్ఫష్టం చేసింది. అంతర్జాతీయ వృద్ధిరేటు 2020లో 4.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2020, ఏప్రిల్లో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక ఔట్లుక్ రిపోర్టు కన్నా ఇది 1.9 శాతం తక్కువ కావడం గమనార్హం. కరోనాతో దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడంతో వృద్ధిరేటు తగ్గునుందని భారతీయ అమెరికన్, ఐఎంఎఫ్ చీఫ్ గీతా గోపీనాథ్ తెలిపారు.
2020 ప్రథమార్థంపై కరోనా ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. మొదట్లో అంచనా వేసిందాని కన్నా తక్కువ వేగంతో రికవరీ రేటు ఉందని గీతా గోపీనాథ్ వెల్లడించారు. చరిత్రలోనే తొలిసారిగా 2020లో అన్ని ప్రాంతాల్లో ప్రతికూల వృద్ధిరేటును అంచనా వేస్తున్నామని ఆమె తెలిపారు.
తొలి త్రైమాసికంలో కాస్త రికవరీ ఉన్నప్పటికీ చైనా వృద్ధిరేటును ఒక శాతంగా అంచనా వేశామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం తగ్గుతుందని, 1961 తర్వాత ఇదే అత్యంత తగ్గుదల అని ఆమె పేర్కొన్నారు. అయితే, 2021లో వృద్ధిరేటు 6 శాతానికి పుంజుకుంటుందని చెప్పారు.
Recommended Video
కరోనా కారణంగా దాదాపు మూడు నెలలపాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. కీలక రంగాలు సహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా సంక్షోభంలోకి వెళ్లిపోయినట్లయింది. ఆర్థిక వృద్ధిరేటు కూడా పడిపోయింది.