చరిత్ర సృష్టించిన బీజేపి..! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..!! ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్..!!
న్యూఢిల్లీ: బీజేపీని మరోమారు అందలం ఎక్కించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు సహా విపక్ష నేతలు కూడా శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా రాహుల్ సోదరి, కాంగ్రెస్ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా.. మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. దేశ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారని, మోదీని మరోమారు ప్రధానిని చేశారని అన్నారు. తమ వైఫల్యాలపై మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు. తాను అనుకున్నది పూర్తిగా తారుమారు అయిందని రాహుల్ పేర్కొన్నారు.
దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!
ఓటమిని ఒప్పుకున్న రాహుల్ గాంధీ..! మోదీకి ప్రియాంక శుభాకాంక్షలు..!!
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో ఓటమిగా దిశగా పయనిస్తున్నారు. కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీతో రాహుల్ పోటీ పడ్డారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య హోరాహోరి పోరు నడిచింది. కాగా లెక్కింపు దగ్గరపడే కొద్ది రాహుల్, స్మృతిల మధ్య ఓట్ల శాతం పెరుగుతూ వస్తోంది. కాగా ఇంకా లెక్కింపు జరుగుతుండగానే రాహుల్ తన ఓటమిని ఒప్పుకున్నారు. స్మృతి ఇరానీకి అభినంధనలు తెలిపారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ 3,11,992 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. కాగా, రాహుల్ గాంధీ 2,73,543 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. రాహుల్పై 38వేల పైచిలుకు మెజారిటీలో స్మృతి ఉన్నారు. కాగా కేరళలోని వయనాడ్ నుంచి ఆల్ ఇండియా రికార్డ్ మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీకి పెట్టని కోట అయిన అమెథిలో ఓటమి సాధించడం గమనార్హం.
మోదీకి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు..! శాంతి సౌభాగ్యాల కోసం కలిసి పని చేద్దామని సందేశం..!!
లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా ఎన్డీయే దూసుకుపోతుండటంతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎన్నికల్లో విజయం సాధిస్తుండటం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యం కోసం మోదీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
కుదేలైన గబ్బర్ సింగ్..! ఊహించని రీతిలో ఓటమి..!!
ఏపీలో తమదే ప్రభుత్వమని, హంగ్ వస్తే తామే కింగ్ మేకర్ అవుతామని మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేసిన జనసేన పార్టీ అధినేత బొక్క బోర్లాపడ్డారు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు అభ్యర్థి రాపాక వరప్రసాద రావు గెలుపొంది పార్టీ పరువు నిలిపాడు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వర్ రావు కు 47573 ఓట్లు రాగా రాపాక వరప్రసాద రావుకు 48740 ఓట్లు వచ్చాయి. స్పల్ప మెజారిటీతో గెలుపొందాడు.
రాజోలు లోనే జనసేన గెలుపు..! నిరాశలో జనసైనికులు..!!
గాజువాకలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ కొణిదెల కు 47,854 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి 58,433 ఓట్లు వచ్చాయి. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు 60,348 ఓట్లు రాగా, పవన్ కళ్యాణ్ కు 56,408 ఓట్లు లభించాయి. 2771 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓడిపోయారు. రెండు చోట్లా పవన్ ఓటమి పాలు కావడంతో జనసైనికులు ఆవేదనలో మునిగిపోయారు. కనీసం ఆయన గెలిచి అసెంబ్లీ జనం సమస్యలు ప్రస్తావిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. ఉత్తరప్రదేశ్ నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి ని రప్పించి విశాఖపట్నంలో బహిరంగ సభ పెట్టినప్పటికీ ఓట్ల రూపంలో మారలేదు.