కొత్త చరిత్రకు శ్రీకారం: కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించనున్న మోడీ, ఇమ్రాన్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పంజాబ్ రాష్ట్రం గుర్దాస్పూర్ జిల్లాలోని చారిత్రాక నగరం డేరా బాబా నానక్ పట్టణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లే తొలి భక్తుల యాత్రను, కర్తార్పూర్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు.
ఇదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ దేశంలోకి భారత మాజీ ప్రధానితోపాటు భారతీయ సిక్కు భక్తులకు స్వాగతం పలికేందుకు కారిడార్ను ప్రారంభించనున్నారు. నవంబర్ 12 సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్ దేవ్ 550వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 72ఏళ్లలో ఇలాంటి సందర్భంగా రావడం గమనార్హం.
కాగా, గురునానక్ దేవ్ తన చివరి 18ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్ సాహిబ్లోనే గడిపారు. ఇది పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న సరోవర్ జిల్లాలో ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడకు వచ్చే యాత్రికుల నుంచి 20 డాలర్ల చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. మొదట ఎలాంటి ఫీజు వసూల చేయవద్దని పాక్ ప్రధాని చెప్పినప్పటికీ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
Punjab: Prime Minister Narendra Modi arrives at Dera Baba Nanak; meets Former Chief Minister of Punjab, Parkash Singh Badal #Kartarpur pic.twitter.com/0XaoJi8oTq
— ANI (@ANI) November 9, 2019
ఇది ఇలావుండగా, సుల్తాన్పూర్ లోధి వద్ద బేర్ సాహిబ్ గురుద్వారాలో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు గుర్దాస్పూర్ ఎంపీ సన్నీ డియోల్, కేంద్రమంత్రి హర్దీప్ పురి, శిరోమణి అకాళీదల్ నేత సుఖ్బీర్ బాదల్ ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా కార్తాపూర్ కారిడార్ చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు.
తొలి యాత్రలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు అకల్ తక్త్ జతేదర్ హర్ ప్రీత్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, సుక్బీర్ సింగ్ బాదల్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, నవజోత్ సింగ్ సిద్ధుతోపాటు పలువురు ఎస్జీపీసీ సభ్యులు, 117 ఎమ్మెల్యేలు, ఎంపీలు, పంజాబ్ మంత్రులు సందర్శించనున్నారు.