భారత్ మాతాకీ జై: భారత మాత ఎప్పుడు? ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని వివాదాస్పదం చేశారు. ఈ నేపథ్యంలోనే 'భారత్ మాత' ఎలా? ఎప్పుడు పుట్టింది? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ పరిపాలనలో భారత దేశం నలిగిపోతున్నప్పుడు 1905లో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది.
అందుకనే భారత మాత వెనకాల కనిపించే మ్యాప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ దేశాలు కూడా ఉంటాయి. తొలుత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అరబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కేఎం మున్షీ అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్ను ప్రశ్నిస్తారు.
అప్పుడు ఆయన తన ఇంటిగోడపై వేలాడుతున్న బ్రిటీష్ పాలనలోని భారత మ్యాప్ను చూపిస్తూ 'ఇది భారత మాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి' అని చెబుతారు. కాగా, ఆయన వ్యాఖ్యలే భారత మాతా అవతరణకు నాంది పలికాయి.
బెంగాల్ సాహిత్యం నుంచి భారత మాత దేవతా రూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువ పూజిస్తారు. ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత మాతకు ప్రచారం లభించింది. తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం' గీతాన్ని భారత మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం గీతాన్ని రాశారు.
ఠాగూర్ మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్గా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ భారత మాతకు చిత్ర రూపం ఇచ్చారు. ఆయన కూడా భారత మాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు. అయితే, అప్పుడు ఏ ముస్లిం కూడా దీన్ని వ్యతిరేకించలేదు.
కాగా, రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. భారత మాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్లో, హరిద్వార్లో ఆలయాలు వెలిశాయి. కాగా, అనాటి నుంచి దేశాన్ని భారత మాతగా గుర్తించి ఆరాధించడం జరుగుతోంది. కాగా, ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ భారత మాత చిత్రాన్ని ఉపయోగించుకుంటోంది. భారతదేశ స్వాతంత్య్రం కోసం దేశ ప్రజలందర్నీ ఏకం చేసిన నినాదం ఇప్పుడు వివాదాస్పదమవడం విచారకరం.