హిస్టరీ టీచర్ టూ ఐపీఎస్... సీబీఐలో అవినీతి ఆరోపణలు... ఇప్పుడు బీఎస్ఎఫ్ చీఫ్గా...
సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) డైరెక్టర్ జనరల్(DG)గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆస్థానా ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) చీఫ్గా వ్యవహరిస్తూనే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) చీఫ్ గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన పనిచేసిన సీబీఐ హెడ్ క్వార్టర్స్,ఇప్పుడు ఆయన చేరబోయే బీఎస్ఎఫ్ కార్యాలయం రెండు సీజీవో కాంప్లెక్స్లోనే ఉండటం గమనార్హం. 2018లో అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ,స్పెషల్ డైరెక్టర్గా ఉన్న రాకేష్ అస్థానా పరస్పర అవినీతి ఆరోపణలతో ఇద్దరూ ఆ శాఖ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
హిస్టరీ టీచర్ నుంచి...
హిస్టరీ టీచర్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన రాకేష్ అస్థానా సీబీఐలో కొనసాగినన్ని రోజులు హైప్రొఫైల్ పొలిటికల్ కేసులను డీల్ చేశారు. కానీ చివరి రెండేళ్లు మాత్రం తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొని చివరకు ఉద్వాసనకు గురయ్యారు. రాకేష్ అస్థానా తండ్రి ఉమ్మడి బిహార్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన నేతర్హత్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేశారు. అదే స్కూల్లో చదువుకున్న అస్థానా... అనంతరం రాంచీలోని సెయింట్ జేవియర్స్,ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారు.
లాలూ అరెస్టుతో మారు మోగిన పేరు...
1984లో సివిల్స్ సాధించడానికి ముందు తాను చదువుకున్న సెయింట్ జేవియర్స్లోనే అస్థానా కొంతకాలం హిస్టరీ టీచర్గా పనిచేశారు. ఐపీఎస్గా ఎంపికయ్యాక కొంతకాలం గుజరాత్లో పనిచేశారు. అనంతరం బిహార్/జార్ఖండ్లలో సీబీఐ ఎస్పీగా ధన్బాద్ బ్రాంచీలో పనిచేశారు. అక్కడినుంచే బిహార్ను కుదిపేసిన పశువుల దానా కేసును డీల్ చేశారు. ఆ కేసుకు సంబంధించి 1997లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ను అరెస్ట్ చేయడంతో అస్థానా పేరు మారు మోగింది. ఒక యంగ్ సీబీఐ ఎస్పీ ఒక దిగ్గజ నేతను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హైప్రొఫైల్ కేసులు...
అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్,ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్, రాజస్తాన్ అంబులెన్స్ స్కామ్,వీవీఐపీ చాపర్ స్కామ్,విజయ మాల్కా స్కామ్స్తో పాటు పలు హైప్రొఫైల్ స్కామ్స్ను అస్థానా విచారించారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లపై వేసిన సిట్ దర్యాప్తుకు అస్థానానే నేత్రుత్వం వహించారు. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన ఆ కేసును ప్రీ ప్లాన్డ్ కుట్రగా పేర్కొని సంచలనం రేపారు. గుజరాత్లో అప్పటి సీఎం నరేంద్ర మోదీ ఎదుర్కొన్న అతిపెద్ద శాంతిభద్రతల సమస్య ఇదే కావడం గమనార్హం. కొన్నాళ్లు సూరత్ పోలీస్ కమిషనర్ గానూ అస్థానా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అద్భుతంగా పనిచేశారని... సూరత్ను వరల్డ్ మ్యాప్లోకి ఎక్కించారని పోలీస్ శాఖ రూపొందించిన ఓ వీడియో అప్పట్లో చక్కర్లు కొట్టింది.
Recommended Video
అవినీతి ఆరోపణలతో సంచలనం...
2018 అక్టోబర్ 23న సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరినీ లీవ్ మీద పంపిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎం. నాగేశ్వరరావును తాత్కాలిక సీబీఐ చీఫ్గా నియమించింది. అవినీతి కేసులను విచారించే సీబీఐలోనే ఇద్దరు టాప్ డైరెక్టర్లు పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకోవడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. సుప్రీం తీర్పుతో అలోక్ వర్మ మరోసారి సీబీఐ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ... మోదీ నేత్రుత్వంలోని హైపవర్ కమిటీ 2-1 మెజారిటీతో ఆయన్ను మళ్లీ పదవి నుంచి తప్పించింది. మరోవైపు రాకేష్ అస్థానాపై వచ్చిన ఆరోపణలను ఈ ఏడాది మార్చిలో కోర్టు కొట్టివేయడంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది.