అమల్లోకి కొత్త చట్టం: ఎయిడ్స్ ఉన్న వ్యక్తిపై వివక్ష చూపితే కటకటాల వెనక్కే..!
Recommended Video
హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకినవారిపై వివక్ష చూపితే ఇకపై శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు హెఐవీ/ఎయిడ్స్ చట్టం 2017కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. గతేడాది ఏప్రిల్ 20న ఈ కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ చట్ట ప్రకారం హెచ్ఐవీతో బాధపడుతున్న వ్యక్తికి ఇళ్లు అద్దెకు ఇవ్వడంలోకానీ, తాను పనిచేసు చోటుకానీ, చికిత్స పొందే చోటకానీ, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ నిరాకరించి వివక్ష చూపితే శిక్షపడుతుంది. అంతేకాదు తనకు హెచ్ఐవీ సోకిందని కచ్చితంగా బయటకు చెప్పాల్సిన అవసరం లేదని.. అయితే కోర్టు అడిగినప్పుడు మాత్రమే చెప్పాల్సి ఉంటుందని చట్టంలో పొందు పర్చారు.
తస్మాత్ జాగ్రత్త: ఈ రాష్ట్రాల్లోనే HIV కేసులు అధికంగా ఉన్నాయి
హెచ్ఐవీ /ఎయిడ్స్ చట్టప్రకారం 18 ఏళ్లలోపు వారికి వ్యాధి సోకితే తాను మరొకరితో కలిసి ఒకే గదిని పంచుకునే హక్కు ఉందని పేర్కొంది. అంతేకాదు ఎయిడ్స్ సోకిన వ్యక్తి గురించి తనకు ఆ వ్యాధి ఉందని ప్రచారం చేసినా శిక్ష పడుతుందని చట్టం చెబుతోంది. ఎయిడ్స్ సోకిన వ్యక్తిని హీనంగా చూసినా అతని గురించి ఇతరులకు చెడుగా చెప్పినా శిక్షార్హులవుతారని చట్టంలో పొందుపర్చారు.
హెచ్ఐవీతో బాధపడుతున్న మైనర్లకు పెద్దవారి అండ ఉండాలని చట్టం చెబుతోంది. 12ఏళ్లనుంచి 18 ఏళ్ల వ్యక్తి ఎయిడ్స్ పై పూర్తి అవగాహన ఉంటే...అలాంటి వారు తమ కుటుంబంలో ఉన్న 18 ఏళ్లలోపు మైనర్ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతుంటే వారికి సంరక్షుడిగా ఉండొచ్చని చట్టం చెబుతోంది. ఇలా గార్డియన్గా ఉండటం ద్వారా విద్యాసంస్థల్లో అడ్మిషన్ల సమయంలో, బ్యాంక్ ఖాతాల నిర్వహణలో, ఆస్తుల నిర్వహణలో, చికిత్స చేయిస్తున్న సమయంలో ఎయిడ్స్ సోకిన వ్యక్తి తరపున సంరక్షకులుగా వీరు సంతకాలు చేయొచ్చని కొత్త చట్టం చెబుతోంది.