షాకింగ్: హెచ్ఐవీ మహిళ, రెండు పెళ్లిళ్లు, రెండో భర్త సాయంతో మొదటి భర్తను చంపి...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని బధోయ్ జిల్లాలో ఓ హత్య కేసు సంచలనం సృష్టించింది. హెచ్ఐవీ సోకిన ఓ మహిళ ఆ విషయం దాచిపెట్టి.. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లాడి, రెండో భర్త సాయంతో శ్రీమంతుడైన మొదటి భర్తను హతమార్చింది.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఆమె పేరును బయటికి వెల్లడించకుండా దర్యాప్తు జరుపుతున్నారు. ఆ మహిళను, ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన కారణాలు కనుగొనేందుకు విచారణ జరుపుతున్నారు.
మొదటి భర్త నుంచి విడివడి...
సదరు మహిళకు 2001లో సుధీర్ దీక్షిత్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరి కాపురం కొన్నాళ్లపాటు సజావుగానే సాగినా ఆ తరువాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్తనుంచి వేరుపడి ఒంటరిగా ఉండడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు జితేన్ మౌర్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
రెండో భర్తతోనూ గొడవలే...
2015లో జితేన్ మౌర్యతో పరిచయం చివరికి ప్రేమగా మరి అతడితో పెళ్లికి దారితీసింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తరువాత ఇతడితోనూ గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ 14 ఏళ్ల తరువాత ఆ మహిళకు, ఆమె మొదటి భర్తకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో రెండో భర్త అయిన జితేన్ మౌర్యను, కుమార్తెను వదిలేసి మొదటి భర్త సుధీర్ దీక్షిత్ వద్దకు వెళ్లిపోయింది.
ఆమె హెచ్ఐవీ పాజిటివ్...
మొదటి భర్త సుధీర్ దీక్షిత్కు, రెండో భర్త జితేన్ మౌర్యకూ తెలియని విషయం ఏమిటంటే.. ఆమె రెండుమార్లు వివాహం చేసుకుందని. తనను వివాహం చేసుకోవడానికి ముందే ఆమెకు మరొకరితో వివాహం అయిందనే విషయం జితేన్ మౌర్యకు తెలియదు. అంతేకాదు, ఆమెకు ఎయిడ్స్ ఉందనే విషయం కూడా అతడికి ఆ తరువాతే తెలిసింది. తెలిశాక కోపంతో ఊగిపోయాడు. అయితే ఆమె మొదటి భర్త శ్రీమంతుడు కావడంతో ఎలాగైనా మెల్లగా మళ్లీ భార్యకు దగ్గరయ్యాడు. తన సంపాదన అంతా ఆమె జల్సాలకు వెచ్చించేవాడు.
మొదటి భర్త ఆస్తిపై రెండో భర్త కన్ను...
ఆ మహిళ మొదటి భర్త సుధీర్ దీక్షిత్ ఆస్తిపై రెండో భర్త జితేన్ మౌర్య కన్నేశాడు. భార్య ఎలాగూ హెచ్ఐవీతో బాధపడుతోంది కనుక రేమో మాపో ఆమె మరణించడం ఖాయమనే అంచనాకి వచ్చాడు మౌర్య. అదే సమయంలో ఆమె మొదటి భర్త దీక్షిత్ అడ్డు కూడా తొలగించుకుంటే అతడి ఆస్తిని అనుభవించవచ్చని భావించాడు. మరోవైపు అతడి భర్య కూడా తిరిగి అతడి గ్రిప్లోకి వచ్చేసింది. దీంతో సుధీర్ దీక్షిత్ హత్యకు పథకం రచించాడు.
మొదటి భర్త హత్యకు పథకం...
జితేన్ మౌర్య తన పథకాన్ని భర్యకు వివరించాడు. మొదటి భర్తను చంపేస్తే అతడి ఆస్తి మన సొంతమవుతుందని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె కూడా అంగీకరించింది. ఫిబ్రవరి 18న ఇద్దరూ కలిసి ఇంట్లోనే సుధీర్ దీక్షిత్ కాళ్లూ చేతులు కట్టేసి బ్లేడుతో అతడి శరీరంపై ఇష్టానుసారం కోసి చంపేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఓ వ్యాన్లో 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి వచ్చేశారు. కానీ పాపం పండి చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి గోప్యంగా విచారిస్తున్నారు.