పుల్వామాలో హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ పోస్టర్లు కలకలం...ఏముందంటే..?
పుల్వామా : జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం గట్టి భద్రతాచర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కశ్మీర్లో అల్లర్లు జరిగిన దాఖలాలు లేవు. తాజాగా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ అక్కడ కలకలం సృష్టించే చర్యలకు దిగుతోంది. పుల్వామా జిల్లా మొత్తం హిజ్బుల్ సంస్థ కొన్ని పోస్టర్లు అంటించింది. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా కశ్మీరీలంతా ఏకంకావాలని ఒక్క తాటిపైకొచ్చి తమ హక్కుల కోసం పోరాడాలంటూ పిలుపునిచ్చింది.
జమ్మూకశ్మీర్లోని ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ను కేంద్రం రద్దు చేసింది. అంతేకాదు జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆగష్టు 5 నుంచి జమ్మూ కశ్మీర్ ప్రాంతం భద్రతాబలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా తమతో ప్రజలంతా కలిసి రావాలంటూ పుల్వామా జిల్లాలో ఉగ్రవాద సంస్థ హిబ్బుల్ ముజాహిద్దీన్ పోస్టర్లు అంటించింది. అంతేకాదు కశ్మీర్లోని రాజకీయ పార్టీ నేతలు కూడా తాము తలబెట్టబోయే నిరసన కార్యక్రమంలో కలిసిరావాలని లేదంటే.... తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోస్టర్ల ద్వారా హెచ్చరించింది.
ఇక కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి అక్కడ పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కొన్ని చోట్ల ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆంక్షల వలయంలో జీవిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాదు అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం ... విపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీనగర్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో పర్యటించేందుకు వెళ్లిన విపక్షపార్టీ నేతలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని ప్రశ్నిస్తున్నారు.