ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో నేటికి ముగ్గురు కేంద్ర మంత్రులు మృతి!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినేట్ లో పని చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులు ఆకస్మికంగా మరణించారు. బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సోమవారం వేకువ జామున ఆకస్మికంగా మరణించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుల్లో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో అనంత్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం బీజేపీలోకి వచ్చిన అనంత్ కుమార్ స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చారు.
అనంత్ కుమార్ ఆకస్మిక మృతితో కర్ణాటక బీజేపీ శాఖకు తీరనిలోటని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులైన కేంద్ర మంత్రులు గోపినాథ్ ముండే, అనీల్ మాధవ్ ధవే కూడా మృతి చెందారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేస్తూ అనంతరం గోవా ముఖ్యమంత్రి అయిన మనోహర్ పారికర్ సైతం అనారోగ్యానికి గురై మృత్యువుతో పోరాడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులు అనారోగ్యానికి గురై వరుసగా మృతి చెందడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళనకు గురౌతున్నారు.