త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు పోతాయా? వెంటాడి తీరుతాయి
లక్నో: ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు మాయావతి.. ఎడతెరిపి లేకుండా కురిపిస్తోన్న విమర్శల జడివానలో చిక్కుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పుల్వామా ఉగ్రదాడిని కేంద్రబిందువుగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతలో మోడీపై నిప్పులు చెరిగిన తరువాత.. మాయావతి దాన్ని అందిపుచ్చుకున్నారు. తనదైన శైలిలో ఆమె మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళా సందర్భంగా అక్కడి త్రివేణి సంగమంలో మోడీ.. పవిత్ర స్నానం ఆచరించిన ఘట్టంపై మాయావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినంత మాత్రానా పాపాలు పోవని మోడీకి చురకలు అంటించారు.
తన అయిదేళ్ల పరిపాలనలో నరేంద్రమోడీ దేశ ప్రజలకు చుక్కలు చూపారని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ఘోర తప్పిదమని, దాని వల్ల సంభవించిన విపరిణామాలు దేశాన్ని అల్లకల్లోలం చేశాయని మాయావతి చెప్పారు. ఈ పాపం ఊరికే పోదని అన్నారు. కుంభమేళాలో స్నానం చేసినంత మాత్రాన పెద్ద నోట్ల రద్దు పాపం పోదని అన్నారు. జీఎస్టీ అమలులో కేంద్రం విఫలమైందని అన్నారు.
గో సంరక్షకుల పేరుతో చేసిన దాడులు, కులం పేరుతో పెట్టిన చిచ్చు, నియంత వంటి పరిపాలన.. ఇవన్నీ మోడీ హయాంలో చోటుచేసుకున్న పాపాలని అన్నారు. అవన్నీ కడుక్కుంటే పోయేవి కావని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రతినెలా సగటున 500 రూపాయలను రైతులకు ఇవ్వడాన్ని కూడా మాయావతి తప్పుపట్టారు. 500 రూపాయల వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. ఓ దినసరి వేతన కార్మికుడికి ఈ 500 రూపాయలు ఉపయోగం కలిగిస్తుందేమో గానీ.. రైతులకు మాత్రం కాదని అన్నారు.