ఎయిమ్స్లో చేరిన అమిత్ షా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మరోసారి..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎయిమ్స్లో చేరారు. శ్వాస కోస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్నానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షాను పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా గత మూడు, నాలుగు రోజుల నుంచి అలసట, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అతను ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచి కూడా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆరోగ్యంగానే అమిత్ షా..
సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు అమిత్ షా ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రైవేట్ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
ఛాతిలో ఇన్ పెక్షన్..
అమిత్ షా సోమవారం ఓ ప్రైవేటు దవాఖానలో సిటీ స్కాన్ చేసుకోగా, పరీక్షా ఫలితాల్లో ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందని, దీంతో ఆయన వైద్యుల సలహా మేరకు ఎయిమ్స్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఛాతి నిపుణులు, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పరిశీలనలో ప్రస్తుతం అమిత్ షా చికిత్స తీసుకుంటున్నారు. 24 గంటల పాటు తమ పరిశీలనలో ఉంటారని గులేరియా తెలిపారు.
మేదాంతలో కరోనాకు చికిత్స..
ఈ నెల 2వ తేదీన గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో అమిత్ షా చేరారు. కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. వైద్యుల సూచనమేరకు చికిత్స తీసుకున్నారు. 12 రోజుల తర్వాత 14వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్నే ఆయనే ట్వీట్ చేశారు. కానీ వైద్యులు మరికొద్దీ రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించినట్టు తెలిపారు. అంతకుముందు తనను కలిసిన వారు కూడా ఐసోలేషన్లో ఉండాలని షా కోరారు.
అందరికీ థాంక్స్
కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమిత్ షా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. తనకు వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా అమిత్ షా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.