ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి - ఆస్పత్రి నుంచే వీడియో కాన్ఫరెన్స్ - కరోనాపై కీలక వ్యాఖ్యలు
కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా కోలుకున్నారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నుంచి షా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి.
హైదరాబాద్: అతి భారీ హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలన్న లోకేశ్ - మూసీ ఒడ్డున మొసళ్ల కలకలం
ఆగస్టు 2న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అమిత్ షా.. గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. మూడు వారాల చికిత్స అనంతరం నెగటివ్ గా తేలడంతో గతవారమే ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఆదివారం రాత్రి తిరిగి సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. కాగా,
ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు అమిత్ షా.. ఆస్పత్రి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా గాంధీనగర్ లో నిర్మించిన నీటి పథకాలను ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడే గాంధీ నగర్ లో నీటి ప్రాజెక్టులు ప్రారంభం అవుతుండటం సంతోషకరమని అమిత్ షా అన్నారు. అలాగే..
చైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రి
దేశంలో కరోనా పరిస్థితిపైనా కేంద్ర హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటం అత్యంత కఠినమైందని, అయితే, క్రమక్రమంగా పరిస్థితి మెరుగుపడుతూ వస్తున్నదని, వైరస్ ముప్పు తొలిగిపోయేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని అమిత్ షా అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు, 1,132 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,18,254కు, మరణాల సంఖ్య 83,198కు పెరిగింది.