నవరాత్రి కానుక: న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణో కట్రాకు వందేభారత్ ఎక్స్ప్రెస్
Recommended Video
న్యూఢిల్లీ: నవరాత్రి వేళ జమ్మూకశ్మీర్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానుక ప్రకటించారు. న్యూఢిల్లీ నుంచి కట్రా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రైలును స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
అక్టోబర్ 5 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి..
వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు అక్టోబర్ 5 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఐఆర్సీటీసీలో టికెట్ల అమ్మకాలను ప్రారంభించారు. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి కట్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవీ వరకు వెళుతుందని రైల్వే శాఖ తెలిపింది. దీంతో 4 గంటల పాటు సమయం ఆదా అవుతుందని వివరించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కడంతో ఇకపై భక్తులు సులభంగా వైష్ణోదేవి ఆలయంకు చేరుకోగలరు. గాంధీజీ స్వదేశీ అనే పిలుపును ఇచ్చారని ఈ రోజు స్వదేశీ రైలును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
ట్రెయిన్ టైమింగ్స్ ఇవే..
ట్రెయిన్ నంబర్ 22439 న్యూఢిల్లీ కట్రా వందేభారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి కట్రా స్టేషన్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. అంబాలా కంటోన్మెంట్, లుధియానా, జమ్మూతావి స్టేషన్లలో రెండేసి నిమిషాల పాటు ఆగుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇక తిరుగు ప్రయాణం అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు కట్రా స్టేషన్లో బయలుదేరి రాత్రి 11 గంటలకు న్యూఢిల్లీ స్టేషన్కు చేరుతుంది. ఒక్క మంగళవారం తప్ప మిగతా రోజులన్నీ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇక ఛార్జీలు రూ.1630తో ప్రారంభం కానుండగా గరిష్టంగా రూ.3015గా ఉన్నాయి.
వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలు
వందేభారత్ ఎక్స్ప్రెస్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. మొత్తం 16 లగ్జరీ కోచ్లు ఇందలో ఉన్నాయి. ఇది ఇంజిన్ రహిత రైలు. అత్యంత వేగంతో దూసుకెళుతుంది. ప్రయాణ సమయాన్ని దాదాపు 40శాతం తగ్గిస్తుంది. అంతకుముందు వచ్చిన న్యూఢిల్లీ - వారణాసి వందేభారత్ ఎక్స్ప్రెస్ కంటే ఈ కొత్త ట్రెయిన్లో పెద్ద ప్యాంట్రీ ఉంది. రాళ్లు రువ్విన లేదా రాళ్లతో దాడి చేసిన లోపల ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓ ప్రత్యేకమైన గ్లాస్ను బిగించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కొత్త రైలును ప్రయాణికులకు తీసుకొచ్చారు. 2022 నాటికి మరో 40 రైళ్లను పట్టాలెక్కిస్తామని రైల్వే శాఖ తెలిపింది.