అమిత్ షా ట్విట్టర్పై దుమారం: ప్రొఫైల్ పిక్ లాక్: నోటీసులు ఇచ్చిన రోజే: హోం శాఖ జోక్యం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను కొంత సమయం పాటు లాక్ చేసింది. ప్రొఫైల్ ఫొటోకు బదులుగా- దాన్ని ఎందుకు డిస్ప్లే చేయట్లేదో, ఎందుకు లాక్ చేయాల్సి వచ్చిందనే సమాచారాన్ని ఉంచింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లఢక్లోని కొన్ని కీలక ప్రదేశాలను చైనా భూభాగానికి చెందినట్లు గుర్తించడం పట్ల ట్విట్టర్కు నోటీసులను జారీ చేసిన రోజే.. అమిత్ షా ప్రొఫైల్ ఫొటోకు తాళం పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
ఈ విఫయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది. వివరణ ఇవ్వాలని ట్విట్టర్ ఇండియా యాజమాన్యాన్ని ఆదేశించింది. వివరణ కోరిన కొద్దిసేపటికే ఆయన ప్రొఫైల్ ఫొటోను పునరుద్ధరించింది ట్విట్టర్ యాజమాన్యం. హోం శాఖ అధికారులు ఆదేశించినట్టుగా వివరణ కూడా ఇచ్చింది. కాపీరైట్ సమస్య రావడం వల్ల దాన్ని లాక్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. అనంతరం దాన్ని రీస్టోర్ చేసినట్లు వెల్లడించింది.
ట్విట్టరెట్టీలు తమ అకౌంట్లో ప్రొఫైల్ ఫొటోలను ఉంచుకోవడం సర్వసాధారణం. అమిత్ షా కూడా తన ఫొటోను ప్రొఫైల్ పిక్గా అమర్చారు. ఆ ఫొటో ఇప్పడు వివాదానికి దారి తీసింది. ఆ ఫొటో తాను తీసిందేనని, తన అనుమతి లేకుండా అమిత్ షా దాన్ని వినియోగించుకుంటున్నారంటూ ఓ వ్యక్తి ట్విటర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇది కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నారు. ఆ ఫొటో తనదేనంటూ ఆ వ్యక్తి అందుకు తగిన సాక్ష్యాధారాలను పంపించడంతో ట్విట్టర్ యాజమాన్యం దాన్ని లాక్ చేసింది.
జమ్మూ కాశ్మీర్, లేహ్, లఢక్లోని కొన్ని కీలక ప్రాంతాలను చైనా భూభాగానికి చెందినవంటూ కొద్దిరోజుల కిందట ట్విట్టర్ గుర్తించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ట్విట్టర్ మ్యాప్లను తెరిచి చూస్తే.. సంబంధిత ప్రదేశం చైనాలో ఉన్నట్లు డిస్ప్లే ఇచ్చింది ట్విట్టర్. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులను పంపించింది. అదే రోజు సాయంత్రానికి ట్విట్టర్.. అమిత్ షా ప్రొఫైల్ పిక్ను లాక్ చేసేయడం చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో వివాదానికి తెర పడింది.