కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న కేంద్రమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఆయనకు కరోనా టీకా వేసినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయమే ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని గంటల తర్వాత కేంద్ర హోమంత్రి అమిత్ షా కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ తీసుకోగా.. అమిత్ షా గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో టీకా వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ మీద దేశ ప్రజల్లో భయం, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వారి అపోహలను తొలగించేందుకు ప్రధాని, హోంమంత్రి సహా పలువురు ప్రజాప్రతినిధులు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, గత ఆగస్టులో అమిత్ షా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. 56ఏళ్ల అమిత్ షా అప్పుడు మేదాంత ఆస్పత్రి, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా కోలుకున్నారు.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఒక్కరోజే 15,510 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 87.25 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో 8293, కేరళలో 3254, పంజాబ్ లో 579, కర్ణాటకలో 521, తమిళనాడులో 479, గుజరాత్లో 407 కొత్త కరోనా కేసులు పెరగాయి. గత 24 గంటల్లో 106 మరణాలు నమోదైనప్పటికీ వాటిలో 87 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కొత్త మరణాల్లో మహారాష్ట్రలో 62, కేరళలో 15, పంజాబ్ 7, కర్ణాటక 5, తమిళనాడు 3 చొప్పున నమోదయ్యాయి.
దేశంలో ప్రస్తుతం 1,68,627(1.52శాతం) యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లోనే 84 శాతం యాక్టివ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 46.39శాతం, కేరళలో 29.49 శాతం, కర్ణాటకలో 3.45 శాతం, పంజాబ్లో 2.75శాతం, తమిళనాడులో 2.39శాతం చొప్పున ఉంది. కాగా, అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలో 10వేలకుపైగా యాక్టివ్ కేసులుండగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.