మెర్సీ పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి: మెమెన్కు రేపే ఉరి
న్యూఢిల్లీ: యాకుబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దీంతో రేపు (గురువారం) ఉదయమే అతనికి ఉరి శిక్ష అమలు చేయనున్నారు. తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య రాష్ట్రపతి నిర్ణయం వెలువడింది.
యాకూబ్ మెమెన్ మెర్సీ పిటిషన్పై సుదీర్ఘ పరిశీలన జరిపిన తర్వాత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చాలని ఆయన సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆ అయితే, రాష్ట్రపతి సోలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరారని అంటున్నారు. ఆ తర్వాత ఆయన యాకుబ్ మెమెన్ మెర్సీ పిటిషన్ను తిరస్కరించారు. రాజ్నాథ్ సింగ్తో గంటన్నర సేపు చర్చలు జరిపిన తర్వాత రాష్ట్రపతి తన నిర్ణయం తీసుకున్నారు.
ఈలోగానే మరో పరిణామం చోటు చేసుకుంది. యాకూబ్ మెమెన్ తరఫు న్యాయవాదులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు మెమెన్కు ఉరి శిక్షను వాయిదా వేయాలని వారు అన్నారు.
ముంబై వరుస పేలుళ్ల కేసులోదోషిగా తేలిన యాకూబ్ మెమెన్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాబిక్ష ఆర్జీపై హోం మంత్రిత్వ శాఖ పరిశీలించింది. దానికి ముందు యాకూబ్ మెమెన్ మెర్సీ పిటిషన్ ఇంకా పరిశీలనలోనే ఉందంటూ కేంద్ర హోం మంత్రిత్వ రాజ్నాథ్ సింగ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు.
యాకుబ్ మెమన్ ఉరి ప్రక్రియ కేవలం రెండు గంటల్లో పూర్తి కానుంది. నాగ్పూర్ జైలులో గురవారం తెల్లవారు జామున ఐదు గంటలకు మెమన్ను నిద్ర లేపుతారు. స్నానం చేసిన తర్వాత మెమన్ కోరిక ప్రకారం చదువుకోవడానికి మతగ్రంథాన్ని అందిస్తారు. మెమన్ కోరితే జైలు అధికారులు మత గురువును ఆయన జైలు గదిలోపలికి అనుమతిస్తారు. యాకుబ్కు ఇష్టమైన ఆహారాన్ని పెడతారు.
చిన్నపాటి కోరికలుంటే వాటిని తీరుస్తారు. సరిగ్గా ఉదయం ఏడు గంటలకు ఉరి తీస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉరి తర్వాత పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని మెమన్ కుటుంబసభ్యులకు అందజేస్తారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించుకోవాలనేది ఆయన కుటుంబసభ్యులు నిర్ణయించుకోవచ్చు. ముంబైలోనే అంత్యక్రియలు జరిగే అవకాశముందనే సమాచారంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.