అమర్నాథ్ టెర్రర్ అటాక్పై కేంద్రం సీరియస్, దాడి వెనుక అతనే!
అమర్నాథ్ యాత్రలో ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పవిత్ర అమర్నాథ్యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు పెట్రేగిపోయిన విషయం తెలిసిందే.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పవిత్ర అమర్నాథ్యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు పెట్రేగిపోయిన విషయం తెలిసిందే.
అనంత్నాగ్ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పోలీసులు సహా మరో 11 మంది గాయపడ్డారు.
అనంత్ నాగ్ లో విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు మృతి
దీనిపై కేంద్రం సీరియస్గా ఉంది. అమర్నాథ్ మార్గంలో అదనపు సెక్యూరిటీని నియమించారు. అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ జల్లెడ పడుతోంది. శ్రీనగర్ - జమ్ము జాతీయ రహదారిని మూసివేసారు. ఉగ్రదాడిని నిరసిస్తూ విపక్షాలు బందుకు పిలుపునిచ్చాయి.
మరోవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో హైలెవల్ సెక్యురిటీ మీటింగ్ జరిగింది. ఉగ్రదాడి, రక్షణ, తదనంతర పరిణామాలపై చర్చించారు.
కాగా, అనంత్నాగ్కు సమీపంలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఒక సాయుధ కారుపై సోమవారం రాత్రి 8.20 గంటలకు ముష్కరులు దాడి చేశారు.
పోలీసులు ప్రతిఘటించడంతో విచక్షణ కోల్పోయిన ముష్కరులు ఉన్మాదంతో కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే పైకి అమర్నాథ్ యాత్రికుల బస్సు వచ్చింది.
ఉగ్రవాదుల తూటాలు తగలడంలో యాత్రికులు బలయ్యారు. వీరంతా అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని సందర్శించుకొని తిరుగుప్రయాణంలో ఉన్నారు.
ఈ బస్సు సోన్మార్గ్ నుంచి బయలుదేరింది. బస్సు డ్రైవర్ యాత్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీద తిరగకూడదని చెప్పారు.
ఈ బస్సు గుజరాత్కు చెందిందని అధికారులు చెప్పారు. సీఆర్పీఎఫ్ భద్రత కలిగిన ప్రధాన యాత్రలో ఇది భాగం కాదని పేర్కొన్నారు. ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు.
కాశ్మీర్ చరిత్రలో చీకటి రోజని రాష్ట్ర మంత్రి నయీం అఖ్తర్ తెలిపారు. యాత్రికులను లక్ష్యంగా చేసుకోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని చెప్పారు.
ఉగ్రదాడి వెనుక వారేనా?
అమర్నాథ్ యాత్రలో ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా మాస్టర్ మైండ్ అబూ ఇస్మాయిల్ ఉన్నాడని కాశ్మీర్ పోలీసులు స్పష్టం చేసారు. పాక్కు చెందిన అబూ యాత్రికులపై దాడికి ప్లాన్ చేశాడని తేల్చారు.