ఐటీ దిగ్గజానికి కేంద్రం షాక్! ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్!
ఢిల్లీ : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు కేంద్రం షాక్ ఇచ్చింది. కంపెనీ నేతృత్వంలో నడుస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ను హోంశాఖ రద్దు చేసింది. విదేశీ నిధుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు తప్పనిసరిగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్... ఫెరా కింద నమోదుచేసుకోవాలి. ఇన్ఫోసిస్కు రిజిస్టేషన్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించినందుకు దాన్ని రద్దుచేసింది.
ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ అయిన ఎన్జీఓలు ఏటా వార్షిక ఆదాయం, విదేశీ నిధులను ఎలా ఖర్చుచేశారన్న వివరాలతో పాటు బ్యాలెన్స్ షీట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఏడాదిలో విదేశాల నుంచి ఎలాంటి విరాళాలు రాకపోయినా నిల్ రిటర్నులు దాఖలు చేయాలి. అయితే ఇన్ఫోసిస్ గత ఆరేళ్లుగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో గతేడాది కేంద్ర హోంశాక నోటీసులు జారీ చేసింది. అయినా కంపెనీ స్పందించకపోవడంతో చివరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ కేంద్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దుపై ఇన్ఫోసిస్ స్పందించింది. ఆ వార్తలు నిజమేనని స్పష్టం చేసింది. అయితే 2016లో ఫెరాలో చేసిన సవరణల మేరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆ చట్టం పరిధిలోకి రాదని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. సుధామూర్తి ఛైర్ పర్సన్గా ఉన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను 1996లో స్థాపించారు.