ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు వద్దు.., సీఎంలకు కేంద్రం సంచలన ఆదేశాలు
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రులకు భద్రత పరమైన ప్రమాదాలు పొంచి ఉన్నందు వల్ల ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు చేయవద్దని సూచించింది.
కొందరు ముఖ్యమంత్రులు ఎలాంటి సమాచారం అందించకుండానే ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారని హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు వారి భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందని హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటిస్తున్నపుడు తప్పక సమాచారం అందించాలని సూచించింది.
ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ముందుగా సమాచారం అందిస్తే వారికి జడ్ లేదా జడ్ ప్లస్ భద్రతతో పాటు వసతి సౌకర్యాలను కూడా ఆతిధ్యమిస్తున్న రాష్ట్రం చేస్తుందని హోంశాఖ కార్యదర్శి రాసిన లేఖలో వివరించారు.