అమిత్ షా వేట ప్రారంభించారు: ఈ టాప్టెన్ మిలిటెంట్లను ఏరిపారేస్తామన్న హోంశాఖ
కొత్త బాస్ కింద కేంద్రహోం మంత్రిత్వ శాఖ అప్పుడే అడుగులు ముందుకేసింది. దేశాన్ని ఉగ్రవాదం అనే పురుగు పీడిస్తున్న నేపథ్యంలో టాప్ పది మందితో కూడిన ఉగ్రవాదుల జాబితానే కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ రియాజ్ నైకూ, లష్కరే తొయిబా జిల్లా కమాండర్ వసీం అహ్మద్ అలియాస్ ఒసామా, హిజ్బుల్ సంస్థకు చెందిన అష్రాఫ్ మౌల్వీల పేర్లను చేర్చింది.
కేంద్ర బలగాలు ఇచ్చిన సమాచారంతో ఈ జాబితా తయారు చేసింది కేంద్ర హోంశాఖ. జమ్ము కశ్మీర్లోని పలు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తొయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన వాంటెడ్ టెరరిస్టుల పేర్లను జాబితాలో చేర్చింది. ఇక ఇతర పేర్లు ఇలా ఉన్నాయి. బారాముల్లాలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన డిస్ట్రిక్ట్ కమాండర్ మెహ్రాజుద్దీన్, శ్రీనగర్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ సైఫుల్లా, పుల్వామా జిల్లా కమాండర్గా పనిచేస్తున్న అర్షద్ ఉల్ హక్, జైషే మహ్మద్కు చెందిన ఆపరేషనల్ కమాండర్ హఫీజ్ ఓమర్, అదే సంస్థకు చెందిన జహీద్ షేక్, అల్ బదర్ సంస్థకు చెందిన జావేద్ మటూ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కుప్వారా డిస్ట్రిక్ట్ కమాండర్ ఇజాజ్ అహ్మద్ మాలిక్ పేర్లను జాబితాలో చేర్చింది. ఇక ఇప్పటి వరకు 102 మంది మిలిటెంట్లను కశ్మీర్లోయలో మట్టుబెట్టినట్లు చెప్పిన హోంశాఖ, ఇంకా 286 మంది క్రియాశీలకంగా ఉన్నారని వెల్లడించింది.
ఇక హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమిత్ షాను జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. 15 నిమిషాల పాటు సమావేశమైన గవర్నర్ సత్యపాల్ మాలిక్... అమరనాథ్ యాత్ర పట్ల ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో వివరించారు. జూలై 1 నుంచి 46 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర ఉంటుంది. మాసిక్ శివరాత్రి రోజున ప్రారంభమై ఆగష్టు 15 శ్రావణ పూర్ణిమ సందర్భంగా ముగియనుంది. ఇక జమ్ముకశ్మీర్లోని శాంతిభద్రతలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై ఎలాంటి చర్చ జరపలేదని గవర్నర్ సత్యాపాల్ మాలిక్ చెప్పారు. అది ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం అని ఆయన చెప్పారు. జూన్ 2018 నుంచి జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉంది.