అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!
న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నాయకుడిగా పేరుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు. అవినీతికి పాల్పడిన, లంచం రుచి మరిగిన అధికారులను బలవంతంగా ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయించిన ఘనత ఆయనకు ఉంది. అలాంటి నాయకుడి సొంత పేషీలో ఓ అవినీతి అనకొండ వెలుగులోకి వచ్చింది. అయిదు కాదు, పదీ కాదు.. ఏకంగా 16 లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేసిన ఓ సాధారణ సెక్షన్ ఆఫీసర్ ను సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆ అధికారి పేరు ధీరజ్ కుమార్ సింగ్. ఓ కేసు విషయంలో నిందితుడి నుంచి 16 లక్షల రూపాయల నగదును తీసుకుంటూ సీబీఐ అధికారుల చేతికి చిక్కారాయన.
టీడీపీ అజెండాను బీజేపీ మోస్తోంది..నిర్వీర్యం కావడం తథ్యం?: ఐవైఆర్
ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసు అది. తనపై వచ్చిన విచారణను తప్పించేలా ఆ ఐపీఎస్ అధికారి.. సెక్షన్ ఆఫీసర్ ధీరజ్ కుమార్ సింగ్ తో రెండు కోట్ల రూపాయల బేరాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా- తొలి విడతగా ఆయన 16 లక్షల రూపాయల నగదును ఆయనకు అందజేశారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో..
సీబీఐ అధికారులు వల పన్ని మరీ ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్ కుమార్ సింగ్ తో బేరం కుదుర్చుకున్న ఆ ఐపీఎస్ అధికారి ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. దీనిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ధీరజ్ కుమార్ సింగ్ పై కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీకి తరలించారు.