కేంద్ర హోంశాఖ విఫలం.. ఢిల్లీ అల్లర్లపై రజనీకాంత్ ఘాటైన రియాక్షన్..
ఢిల్లీలో చెలరేగిన హింసపై సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. జరిగిన ఘోరానికి ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణమన్నారు. మత కల్లోలాలను నియంత్రించడంలో కేంద్ర హోంశాఖ కూడా విఫలమైందన్నారు.అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేయాల్సిందన్నారు. జరిగిన ఘటనలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన రజనీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న వేళ.. ఇంటలిజెన్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకునే పార్టీలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరసనలు హింసాత్మక రూపం దాల్చవద్దని చెప్పారు రజనీకాంత్. గతంలో సీఏఏకి తాను మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకున్న రజనీ.. ఒకవేళ ఆ చట్టం ద్వారా ముస్లింలు ప్రభావితమైతే.. వారికి తాను అండగా నిలుస్తానని చెప్పారు. అయితే జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్ఆర్సీ)ని అమలుచేయడం లేదని కేంద్రం స్పష్టం చేసిందని.. అలాంటప్పుడు దానిపై గందరగోళం సృష్టించడంలో అర్థం లేదని అన్నారు. ఢిల్లీ పరిస్థితుల పట్ల కేంద్రప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవన్నారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా,కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వంటి నేతల వివాదాస్పద వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. వారి విద్వేష ప్రసంగాలు వివాదాస్పద అంశాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) వైఖరిని ప్రతిబింబించలేవని స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA) పార్లమెంట్ ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిందని.. కేంద్రం దాన్ని రద్దు చేస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. తాను సీఏఏకి మద్దతుగా మాట్లాడినప్పుడు కొంతమంది తనను బీజేపీ మనిషి అని విమర్శించారని.. అది తనను నొప్పించిందని చెప్పుకొచ్చారు. కాగా,ఢిల్లీలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకు 24 మంది చనిపోగా.. 200 పైచిలుకు మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్,ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ ఉన్నారు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో మరోసారి ఎలాంటి హింస చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలటరీ భద్రత బలగాలు అక్కడ గస్తీ కాస్తున్నాయి.