శారదా స్కాంలో సిబిఐపై ఒత్తిడి: హోంశాఖ కార్యదర్శి గోస్వామికి ఉద్వాసన
న్యూడిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి మాతంగ్ సింగ్ను కాపాడేందుకు ప్రయత్నాలు సాగించారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనీల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశం మేరకు అనీల్ గోస్వామి బుధవారం రాత్రి తన పదవి నుంచి వైదొలిగారు.
ఆయన స్థానే హోం శాఖ కొత్త కార్యదర్శిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి ఎల్.సి. గోయల్ను నియమించారు. గోస్వామిని పిఎంఓ కార్యాలయానికి పిలిపించిన సీనియర్ అధికారులు మాతంగ్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తెచ్చిన అంశం గురించి ప్రశ్నించారు. మాతంగ్ సింగ్ అరెస్టు విషయంలో గోస్వామి తమపై వత్తిడి తెస్తున్నారని సిబిఐ డైరక్టర్ ప్రధాన మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సిబిఐ ఫిర్యాదు మేరకు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఉదయం అనీల్ గోస్వామిని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. మాతంగ్ విషయంలో సిబిఐ అధికారులతో టెలిఫోన్లో మాట్లాడినట్లు గోస్వామి అంగీకరించారు. అనంతరం గోస్వామితో జరిపిన చర్చలపై ఒక నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయానికి రాజ్నాథ్ పంపించారు.
ఆ నివేదికలోని అంశాల్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పిఎంఓ సీనియర్ అధికారులతో చర్చించారు. ఆ నేపధ్యంలో గోస్వామిని పిలిపించుకున్న పిఎంఓ అధికారులు అనేక అంశాలపై ఆయన్ని ప్రశ్నించారు. అధికారుల ఆదేశం మేరకు బుధవారం రాత్రి అనీల్ గోస్వామి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.