పాపం పసివాడు... నాన్న జైల్లో,అమ్మ వదిలేసింది.. ఒంటరిగా ఫుట్పాత్పై...
నాన్న జైలుకెళ్లాడు... అమ్మ వదిలేసింది... 9 ఏళ్ల వయసులో ఆ పసివాడు ఒంటరిగా రోడ్డున పడ్డాడు... టీ స్టాల్స్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. రాత్రిపూట ఫుట్పాత్ పక్కన నిద్రపోతున్నాడు. అతనికి తోడుగా అతని పక్కనే ఓ శునకం కూడా నిద్రిస్తుంటుంది. ఇటీవల ఆ పసివాడు,ఆ శునకం ఫుట్పాత్ పక్కన నిద్రిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫోటో చూసి చాలామంది నెటిజన్లు ఇంత చిన్న వయసులో ఆ పసివాడికి ఎంత కష్టమొచ్చిందని అనుకున్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్నగర్ జిల్లాలో ఆ బాలుడి ఆచూకీని స్థానిక అధికారులు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటో ఆధారంగా అతని కోసం ఆరా తీసిన అధికారులు ఎట్టకేలకు అతని ఆచూకీ తెలుసుకోగలిగారు. స్థానిక అధికారుల కథనం ప్రకారం... 9 ఏళ్ల వయసున్న ఆ బాలుడి పేరు అంకిత్. ఎక్కడినుంచి వచ్చాడో అతనికే గుర్తు లేదు. తండ్రి జైలుకు వెళ్లాడని... తల్లి తనను వదిలేసిందని మాత్రం చెప్తున్నాడు. ముజఫర్నగర్లోని స్థానిక టీ స్టాల్స్లో పనిచేస్తూ,బెలూన్స్ అమ్ముతూ వచ్చిన డబ్బులతో ఏదైనా హోటల్లో భోజనం చేసి ఫుట్పాత్ పక్కనే నిద్రిస్తున్నాడు.
అతనికి తోడుగా డానీ అనే శునకం కూడా ఉంది. అంకిత్ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తుంది. అంకిత్ టీ స్టాల్స్లో పనిచేసే సమయంలో అక్కడే ఓ మూలన కూర్చుండి ఉంటుంది. రాత్రి పూట అతనితో పాటే నిద్రపోతుంది.ఏ క్షణంలోనూ డానీ అంకిత్ను విడిచి ఉండదు.అంకిత్కు ఆత్మగౌరవం ఎక్కువని అతను పనిచేసే టీ స్టాల్ యజమాని ఒకరు చెప్పారు. ఏదైనా ఉచితంగా ఇస్తే అసలు తీసుకోడని... ఆఖరికి అతని పెంపుడు శునకం డానీకి ఉచితంగా పాలు పోసినా ఒప్పుకోడని అన్నారు. దానికి కూడా డబ్బులు పెట్టే పాలు కొంటాడని చెప్పారు.
Recommended Video
అంకిత్ ఆచూకీని కనిపెట్టిన పోలీసులు అతన్ని తమతో పాటే తీసుకెళ్లారు. అనంతరం శీలా దేవీ అనే మహిళకు ఆ బాలుడి సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. శీలా చాలా ఫ్రెండ్లీగా ఉండే మహిళ అని... బాలుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేంతవరకూ ఆమె వద్దే ఉంటాడని తెలిపారు. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతోనూ మాట్లాడామని... వాళ్లు ఎటువంటి ఫీజు లేకుండానే అంకిత్ను చేర్చుకునేందుకు అంగీకరించారని చెప్పారు.ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు,బంధువుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆ బాలుడి ఫోటోలను రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. ముజఫర్నగర్ మహిళా శిశు సంక్షేమ విభాగాన్ని కూడా అప్రమత్తం చేశారు.