బురఖాలో హనీప్రీత్! గుర్మీత్ తండ్రిలాంటి వాడు, ప్రాణహాని ఉందంటూ హైకోర్టులో పిటిషన్
ముందస్తు బెయిల్ పై సంతకం చేసేందుకు రహస్యంగా ఢిల్లీకి వచ్చిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఆ పని కాగానే మళ్లీ మయామైపోయింది.
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ పై సంతకం చేసేందుకు రహస్యంగా ఢిల్లీకి వచ్చిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఆ పని కాగానే మళ్లీ మయామైపోయింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తెలివిగా బురఖా ధరించి తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
అత్యాచారం కేసుల్లో డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దోషిగా తేలిన ఆగస్టు 25 నాటి నుంచి హనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం పంచకుల కోర్టు హనీప్రీత్ సింగ్కు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ఆమె ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందడంతో అరెస్టు చేసేందుకు హర్యానా పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో హర్యానా పోలీసులు మంగళవారం ఆ ప్రాంతమంతా మెరుపు సోదాలు నిర్వహించారు. కానీ ఆమె అక్కడ్నించి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
బురఖాలో తిరుగుతున్న హనీప్రీత్?
డేరా బాబా రామ్ రహీమ్ను సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించిన ఆగస్టు 25వ తేదీ నుంచి హనీప్రీత్ పరారీలో ఉంది. దాదాపు నెల రోజులుగా తన కోసం గాలిస్తున్న పోలీసులను ఆమె బురఖాతో బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. పోలీసుల కంట పడకుండా ఆమె ఢిల్లీ వచ్చి, తన లాయర్ ను కలిసి.. చల్లగా జారుకుంది.
సీసీటీవీ ఫుటేజి చెప్పిన నిజం...
ఢిల్లీలోని ఆమె లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య నివాసం వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులకు ఈ విషయం అర్థమైంది. సీసీటీవీ ఫుటేజ్లో లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య నివాసం నుంచి బురఖా ధరించిన ఓ మహిళ బయటకు వస్తున్నట్టు కనిపించింది. దీంతో బురఖాలో ఉన్నది హనీప్రీత్ సింగేనా అనేది విషయాన్ని నిర్దారించే పనిలో పడ్డారు పోలీసులు.
డ్రగ్ మాఫియా నుంచి ప్రాణహాని..
డ్రగ్ మాఫియా నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డేరాబాబా ‘దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని డ్రగ్ మాఫియా ముఠాల నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో ఈ మేరకు పేర్కొన్నట్టు సమాచారం.
గుర్మీత్ నాకు తండ్రిలాంటి వాడు...
తనకే ఏ పాపం తెలియదనీ... డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తనకు తండ్రిలాంటి వాడని హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నేను ఒంటరిదాన్ని. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. చట్టానికి లోబడి ఉంటాను. విచారణలో పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను...'' అని తన పిటిషన్లో పేర్కొంది. హనీప్రీత్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రానున్నట్టు చెబుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన డేరా బాబా..
మరోవైపు అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సోమవారం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల వాంగ్మూలాన్ని సీబీఐ ఆరు సంవత్సరాలు ఆలస్యంగా నమోదు చేసిందని గుర్మీత్ తరపున న్యాయవాది విశాల్ గార్గ్ నార్వానా చెప్పారు. దీని ప్రాతిపదికగా హైకోర్టులో సవాలు చేసినట్లు ఆయన తెలిపారు.
హనీప్రీత్ ఏ తప్పూ చేయలేదు...
మరోవైపు హనీప్రీత్ ఇన్సాన్ ఏ తప్పూ చేయలేదని ఆమె తరపు లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య చెబుతున్నారు. ‘‘గుర్మీత్ శిక్ష, తర్వాత పరిస్థితులు, బాబాకు ఆమెకు మధ్య ఉన్న సంబంధం గురించి చెడుగా వార్తలు రావటంపై హనీప్రీత్ బాధపడ్డారు. అల్లర్లకు ఆమె కారణమన్న పోలీసుల వాదన ముమ్మాటికీ తప్పు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాం..'' అని ప్రదీప్ ఆర్య వ్యాఖ్యానించారు. అంతేకాదు, బెయిల్ అప్లికేషన్పై సంతకం చేసేందుకు హనీప్రీత్ లజ్పత్ నగర్లోని తన కార్యాలయానికి వచ్చినట్లు ప్రదీప్ చెప్పారు. అయితే ఆమె ఎక్కడ తలదాచుకుందనే సమాచారం మాత్రం తనకు తెలియదని ఆయన పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హనీప్రీత్ కు బెయిల్ లభించడం ఆలస్యం కావొచ్చని, కానీ.. బెయిల్ పిటిషన్ను త్వరగా పరిశీలించాలని తాను న్యాయమూర్తిని కోరతానని ప్రదీప్ తెలిపారు.