అవును.. ఆ అల్లర్లు నేనే చేయించాను: ఎట్టకేలకు ఒప్పుకున్న హనీప్రీత్
పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణమంటూ డేరా అధినేత గుర్మీత్ సింగ్ దత్త పుత్రికహనీప్రీత్ సింగ్ ఎట్టకేలకు అంగీకరించింది.
చండీగఢ్: డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలుశిక్ష పడిన అనంతరం హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణమంటూ డేరా అధినేత గుర్మీత్ సింగ్ దత్త పుత్రికహనీప్రీత్ సింగ్ ఎట్టకేలకు అంగీకరించింది.
ఆ అల్లర్లకు గైడ్ మ్యాప్లు తానే తయారుచేశానని, ఇందుకు డేరా శాఖలు కూడా సహకరించాయని పేర్కొంది. గతంలో హనీప్రీత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచకులలో అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్కు 20 ఏళ్ల కారాగార శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంచకులలో అల్లర్లు చోటుచేసుకుని 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గత వారం హనీప్రీత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీప్రీత్కు న్యాయస్థానం అక్టోబరు 13 వరకు రిమాండ్ను పొడిగించింది.
హనీప్రీత్ అరెస్ట్ అనంతరం హర్యానా సిట్ అధికారులు ఆమెను విచారించారు. ఎన్ని ప్రశ్నలు వేసినా హనీప్రీత్ మొదట్లో పంచకుల గురించి నోరువిప్పలేదు. అయితే పంచకుల అల్లర్లలో ఆమే ప్రధాన సూత్రధారి అని ఇప్పటికే పోలీసు అధికారుల కస్టడీలో ఉన్న డేరా అనుచరులు వెల్లడించారు.
దీంతో ఇక చేసేదేమీ లేక హనీప్రీత్ కూడా ఆ విషయాన్ని ఒప్పేసుకున్నారు. ఈ అల్లర్ల కోసం ఆమె ఏకంగా రూ.1.25 కోట్లు ఖర్చుచేసినట్లు పోలీసులు ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజాగా హనీప్రీత్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ల్యాప్టాప్లో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. గుర్మీత్కు శిక్షపడిన తర్వాత భారీ మొత్తంలో నగదును తరలించారని వాటి వివరాలు కూడా హనీప్రీత్ ల్యాప్ట్యాప్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.