పోలీసులకు లొంగిపోనున్న హనీప్రీత్!? ఆమె లాయర్ సలహా అదేనట..
నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా ‘దత్తపుత్రిక’ హనీప్రీత్ సింగ్ ఇక లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ ఇక లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పంజాబ్- హర్యానా హైకోర్టులో ఆమె పోలీసులకు గురువారం లొంగిపోనున్నట్టు చెబుతున్నారు.
హనీప్రీత్ సింగ్ను కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా తాను సూచించినట్టు ఆమె లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య పేర్కొన్నారు. ఫోన్ ద్వారా ఇప్పటికే ఈ విషయం హనీప్రీత్ కు చెప్పానన్నారు. హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మంగళవారం తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.
పోలీసుల ముందు లొంగిపోవడమే మంచిదంటూ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలోనే హనీప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అత్యాచారం కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ దోషిగా తేలిన ఆగస్టు 25న పంచకులలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.
దాదాపు 40 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అల్లర్లలో హనీప్రీత్ ప్రధాన నిందిరాలిగా ఉంది. హనీప్రీత్ను మోస్ట్ వాంటెడ్ నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు.. ఆమెను అరెస్టు చేసేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.