పరువు హత్య : ప్రేమ పెళ్లి చేసుకున్నారని..
తూత్తుకుడి : ఒకే చోట పని చేస్తున్నారు. ఆ పరిచయం కాస్తా తొలుత స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమలోకంలో లోకంలో విహరిస్తున్న ఆ ఇద్దరు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్నారు. ఇదే విషయం కుటుంబసభ్యులకు చెప్పారు. వారు ఒప్పుకోకపోవడంతో స్నేహితుల సాయంతో మూడు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే వారి పెళ్లిని అంగీకరించని పెద్దలు పసుపు పారాణి ఆరకముందే ఆ కొత్త జంటను కడతేర్చారు.
తెగలు వేరు కావడంతో
తూత్తుకూడి జిల్లా పెరియార్ నగర్కు చెందిన శోలైరాజన్ దగ్గరలోని ఉప్పు తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. అక్కదే కుళత్తూరుకు చెందిన జ్యోతి అనే యువతి కూడా ఉద్యోగం చేస్తోంది. ఒకేచోట పని చేస్తుండటంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్లుగా వారి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో తమ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదని భావించారు. అయితే శోలైరాజన్, జ్యోతిల ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ ఇద్దరి తెగలు వేరన్న కారణంతో పెళ్లికి ససేమిరా అన్నారు.
పోలీసుల సమక్షంలో పెళ్లి
పెద్దలు తమ ప్రేమకు అడ్డుచెబుతుండటంతో శోలైరాజన్, జ్యోతి మూడు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ఒప్పుకోలేదు. శోలైరాజ్, జ్యోతిలు మేజర్లు కావడంతో చట్టపరంగా వారి పెళ్లిని అడ్డుకునే హక్కు లేదని తేల్చి చెప్పిన పోలీసులు వారిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత శోలై రాజన్ కుటుంబసభ్యులు మెట్టు దిగివచ్చినా జ్యోతి తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు.
నరికి చంపిన దుండగలు
పోలీసులు, స్నేహితుల సాక్షిగా పెళ్లి చేసుకున్న శోలై రాజన్, జ్యోతిలు పెరియార్ నగర్లో వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం జ్యోతి గర్భవతి. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత దంపతులిద్దరూ ఆరుబయట చాప వేసుకుని పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు గోడదూకి వచ్చిన కొందరు దుండగులు కత్తులు, వేట కొడవళ్లలో ఆ దంపతులపై విచక్షణారహితంగా నరికారు. శోలైరాజన్, జ్యోతి స్పాట్లోనే ప్రాణాలు వదిలారు.
జ్యోతి తండ్రి అరెస్ట్
స్థానికుల ద్వారా విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులతో పాటు శోలైరాజన్ బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు శవాలు కదిలించవద్దని ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దంపతుల హత్యకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.