పరువే ఎక్కువైంది: చెల్లి తల నరికి ఊరేగించారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెల్లెలి కంటే ఆ మూర్ఖులకు పరువు ఎక్కువైంది. చెల్లెలు అని కూడా చూడకుండా ఆమె తల నరికేశారు. ఆ తర్వాత ఆమె తలతో వీధుల గుండా తిరుగుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు.
బహమనీ పంఛాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఫూల్ జెహాన్(17) అనే యువతి మహమ్మద్ అచ్చన్ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తెలిసి వరుసకు సోదరులు అయిన గుల్హసన్, నాన్హే మియాన్ ఆగ్రహానికి లోనయ్యారు.
అందరూ చూస్తుండగానే గ్రామ నడివీధిలో ఫూల్ జెహాన్ తలను అతి దారుణంగా నరికేశారు. తర్వాత మొండాన్ని అక్కడే వదిలేసి, తెగిపడిన తల భాగాన్ని పట్టుకొని వీధుల్లో అరుచుకుంటూ తిరిగారు. తమ కుటుంబాల్లో ఇంకెవ్వరూ ఇటువంటి పరువు తక్కువ పని చేయరాదంటూ హెచ్చరించారు.
తమ చర్య అమ్మాయిలందరికీ గుణపాఠం కావాలంటూ వారిద్దరూ ఉన్మాదంతో ఊగిపోయారు. తాము సరైన శిక్ష విధించామంటూ ఆవేశంతో రెచ్చిపోతూ ఊరంతా తిరిగారు. సినిమాల్లో నేరాలను తలపించే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు.
కాగా, ఇంత దారుణం జరుగుతున్నా స్థానిక పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా ప్రేమికుడు అచ్చన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది సోదరులు ఉన్న కుటుంబంలో ఫూల్ జెహాన్ ఒక్కతే ఆడపిల్ల. మిగితా ఆరుగురు ఢిల్లీలో నివసిస్తున్నట్టు సమాచారం.
ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ యువతి తల్లిదండ్రులు ఊరి నుంచి పరారయ్యారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక బలగాలను తరలించినట్లు చెప్పారు.