మరో పరువు హత్య: ప్రేమజంటపై కత్తులతో దాడి, ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం!
న్యూఢిల్లీ : పరువు కోసం పాకులాడిన అమ్మాయి బంధువులు దారుణానికి పాల్పడ్డారు. ప్రేమజంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. అబ్బాయిని 14 సార్లు, అమ్మాయిని 12 సార్లు కత్తులతో పొడిచారు. ఈ ఘటనలో ఆ అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
తీవ్రంగా గాయపడిన అమ్మాయిని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన న్యూఢిల్లీలోని దల్లుపుర ప్రాంతంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే...దినేష్ అనే యువకుడు(32) ఓ యువతి(23)ని ప్రేమించాడు. శుక్రవారం సాయంత్రం ప్రేయసీ ప్రియులిద్దరూ క్యాబ్ లో వెళుతుండగా అమ్మాయి బంధువులైన రింకూ(25), శంకర్ (23)లు క్యాబ్ను అడ్డగించాు. కారులోంచి దినేష్ దిగగానే అతడిపై కత్తులతో దాడి చేశారు.
పధ్నాలుగుసార్లు కత్తులతో పొడవడంతో దినేష్ అక్కడికక్కడే మరణించాడు. వారిని అడ్డుకోబోయిన అతడి ప్రేయసి కూడా తీవ్రంగా గాయపడింది. ఇదంతా గమనిస్తున్న ఓ హోంగార్డు పరుగుపరుగున అక్కడికొచ్చి నిందితులిద్దరిని పట్టుకున్నాడు.
ఈలోపు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చావుబతుకుల్లో ఉన్న ఆ యువతిని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు.
ఆ యువతి ప్రేమ వల్ల కుటుంబ పరువుకు భంగం కలుగుతుందనే తాము ఈ దారుణానికి పూనుకున్నట్లు నిందితులు చెప్పారు. ఈ ఘటనలో అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు రింకూ, శంకర్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.