మరో పరువు హత్య.. దళిత యువకుడితో ప్రేమ... కన్న కూతురిని చంపిన తండ్రి...
దేశంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచారాలు,కుల హత్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని మగది తాలుకాలో ఓ పరువు హత్య వెలుగుచూసింది. దళిత యువకుడిని ప్రేమించిందన్న కారణంతో కన్నతండ్రే మేనలుళ్లతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. హత్యా నేరాన్ని ఆ దళిత యువకుడిపై నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు నిజాలు వెల్లడయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే... మగది తాలుకాలోని బెట్టహళ్లి గ్రామానికి చెందిన కృష్ణప్ప(48) అనే రైతుకు హేమలత(18) అనే కుమార్తె ఉంది. బీకాం విద్యార్థి అయిన హేమలత కొన్నాళ్లుగా పునీత్ అనే ఓ దళిత వ్యవసాయ కూలీని ప్రేమిస్తోంది. ఈ విషయం తండ్రి కృష్ణప్పకు తెలిసి ఆగ్రహంతో రగిలిపోయాడు. దళిత యువకుడిని ప్రేమించి తన పరువు తీసిందన్న కారణంతో తన మేనలుళ్లు చేతన్(21),కునాల్(17-మైనర్ ఐడెంటీని రివీల్ చేయకుండా పేరు మార్చడం జరిగింది)లతో కలిసి కృష్ణప్ప అక్టోబర్ 8న హేమలతను హత్య చేశాడు.
బెట్టహళ్లి సమీపంలోని ఓ తోటలోకి హేమలతను తీసుకెళ్లి.. అక్కడే బండరాయితో ఆమె తలపై మోది హత్యకు పాల్పడ్డారు. ఆ మరుసటి రోజు అక్టోబర్ 9న ఏమీ తెలియనట్లు కుదూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి.. తన కుమార్తె కనిపించడం లేదంటూ కృష్ణప్ప ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆ మరుసటిరోజు అక్టోబర్ 10న తమ గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో ఉన్న గొయ్యిలో కుళ్లిపోయిన స్థితిలో తన కుమార్తె మృతదేహం కనిపించిందని కృష్ణప్ప పోలీసులకు సమాచారం అందించాడు.
హేమలత బాయ్ఫ్రెండ్ పునీతే ఈ హత్యకు పాల్పడ్డాడని కృష్ణప్ప ఆరోపించాడు. అయితే కృష్ణప్పపై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇద్దరు మేనల్లుళ్లతో కలిసి హేమలతను హత్య చేసినట్లు కృష్ణప్ప నేరం అంగీకరించాడు. పునీత్కి ఈ హత్యతో సంబంధం లేదని వెల్లడించాడు.దీంతో పోలీసులు కృష్ణప్ప అతని మేనల్లుళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.