అక్కడ మరో దారుణం: 14 ఏళ్లకే గర్భం: తండ్రి చేతిలో బాలిక దారుణహత్య: డ్రైనేజీలో దొరికిన తల
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే హత్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతి సామూహిక అత్యాచారం, మృతిచెందిన ఘటనతో అట్టుడికిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కిరాతక ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిలువెల్లా వణికించేలా చేస్తోంది. ఓ మైనర్ బాలిక తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు ఆ బాలిక సోదరుడు సహకరించాడు. బాలిక తల మురుగునీటి కాల్వలో లభించింది. దీన్ని పరువు హత్యగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో మృతురాలి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. సోదరుడు పరారీలో ఉన్నాడు.
ఆకాశ్-ఐశ్వర్య లవ్స్టోరీ: మధ్యలో భర్త: 16 ఏళ్ల వయసులో పెళ్లి: మూడేళ్ల తరువాత ప్రియుడితో మళ్లీ
డ్రైనేజీలో తల..
ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిద్హౌలి బ్లాక్ పరిధిలోని దుల్హాపూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలిక కిందటి నెల 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. తమ కుమార్తె కనిపించట్లేదంటూ ఆమె కుటుంబ సభ్యులెవరూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. బంధువుల ఇంటికి వెళ్లిందంటూ చెప్పుకొచ్చారు. తాజాగా దుల్హాపూర్ గ్రామంలో డ్రైనేజీలో బాలిక తల కనిపించింది. వీధి కుక్కలు దాన్ని బయటికి తీశాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తండ్రిని అదుపులో తీసుకుని..
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తల.. కనిపించకుండా పోయిన బాలికదేనని నిర్ధారించారు. వెంటనే ఆ బాలిక తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత బుకాయించాడు. తన శతృవులెవరైనా ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులకు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. బంధువుల ఇంటికి ఫోన్ చేసి విచారించగా.. ఆ బాలిక తమ ఇంటికి రాలేదని తెలిపారు.
14 సంవత్సరాలకే గర్భం దాల్చడంతో..
దీనితో పోలీసులు.. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిచండంతో నేరాన్ని అంగీకరించాడు. తాను, తన కుమారుడు కలిసి ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. 14 సంవత్సరాలకే తన కుమార్తె గర్భం దాల్చిందని, ఈ విషయం బయటికి తెలిస్తే.. పరువు పోతుందనే కారణంతో ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తు సందర్భంగా అంగీకరించాడని షాజహాన్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ ఆనంద్ తెలిపారు. గర్భం దాల్చడానికి కారణం ఎవరని తాము పలుమార్లు ప్రశ్నించినప్పటికీ.. ఆమె అతని పేరును గానీ, వివరాలను గానీ వెల్లడించలేదని, దీనితో ఆగ్రహానికి లోనైన వారు కుమార్తెను మట్టుబెట్టినట్లు ఎస్ఎస్పీ తెలిపారు.
Recommended Video
పరారీలో సోదరుడు..
బాలిక మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టినట్లు నిందితుడు తెలిపాడని అన్నారు. బాలిక సోదరుడు పరారీలో ఉన్నాడని, అతణ్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాలిక గర్భం దాల్చడానికి కారణం ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు. బాలిక స్నేహితులు.. పరిచయస్తుల ద్వారా అతణ్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సొంత తండ్రి, సోదరుడే బాలిక ఉసురు తీశారని, దీన్ని పరువు హత్యగా భావిస్తున్నామని అన్నారు. సమాజంలో తలెత్తుకుని తిరగలేమనే భయంతో బాలిక తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. వారిపై ఐపీసీ సెక్షన్ 302, 201 కింద కేసు నమోదు చేశామని అన్నారు.