మహారాష్ట్రలో పరువు హత్య: కన్న కూతురి పట్ల కాలయముడైన తండ్రి....అల్లుడి పరిస్థితి విషమం
మహారాష్ట్ర: మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. కూతురు మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే ఆమె పట్ల కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన రుక్మిణి రామ భారతీయ అనే యువతి చంద్రకాంత్ రానాసింగ్ అనే యువకుడిని ప్రేమవివాహం చేసుకుంది. ఇద్దరివి వేరువేరు కులాలు. అయితే వీరి ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవద్దని వారించారు. కానీ తన జీవితాన్ని చంద్రకాంత్తోనే పంచుకోవాలని భావించిన రుక్మిణి ఆయన్ను గతేడాది పెళ్లి చేసుకుంది.
ఇక కొన్ని నెలలు గడిచిన తర్వాత తల్లిదండ్రులను చూద్దామని రుక్మిణి తన సొంత గ్రామమైన నిగోజికి ఏప్రిల్ 28న వెళ్లింది. ఇక మే 1వ తేదీన ఆమెను తీసుకెళదామని అత్తారింటికి వచ్చాడు చంద్రకాంత్. రుక్మిణి ఇంటికి వెళ్లగానే ఆమె తండ్రి రామభారతీయ, బంధువులు సురేంద్రకుమార్, ఘన్శ్యా రనేజ్లు రుక్మిణి ఆమె భర్త చంద్రకాంత్ను ఒక గదిలో బంధించి ఆ గదికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న ఇద్దరూ కాపాడాల్సిందిగా కేకలు వేశారు. కానీ గదికి తాళం వేసి ఉండటంతో మంటల్లో కాలిపోయారు. వారి కేకలు అరుపులు విన్న పొరిగింటి వారు వెంటనే తలపులు పగలగొట్టి ఇద్దరినీ కాపాడగలిగారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పూణేలోని ససూన్ హాస్పిటల్కు రుక్మిణిని చంద్రకాంత్ను తరలించినట్లు పొరిగింటివారు చెప్పారు. చికిత్స పొందుతూ రుక్మిణి ఆదివారం మృతి చెందింది.అయితే కొన ఊపిరితో ఉన్న రుక్మిణి తన వాంగ్మూలంలో తండ్రితో పాటు మిగతా ఇద్దరిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేంద్రకుమార్ ఘన్శ్యాంలను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు యువతి తండ్రి రామభారతీయ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇక చంద్రకాంత్ పరిస్థితి 40 శాతం గాయాలతో కాస్త విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.