అండగా నేనున్నా: అధైర్య పడొద్దు..మరోసారి ప్రయత్నించండి: ప్రధాని
బెంగళూరు: చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడం భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది. చిట్ట చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గతి తప్పింది.. తన గమ్యాన్ని విడనాడింది. చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. సుమారు 40 నిమిషాలు పాటు శాస్త్రవేత్తలు సంకేతాల కోసం ఎదురు చూశారు. అయినప్పటికీ.. ల్యాండర్ నుంచి ఎలాంటి సమాచారం గానీ.. అంకెలు గానీ గ్రౌండ్ స్టేషన్ కు రాలేదు. దీనితో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు.
నిరాశలో శాస్త్రవేత్తలు..ప్రధాని ఊరడింపు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం ల్యాండింగ్ సమయంలో విఫలం కావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్ర నిరాశకు గురి చేసింది. చాలాసేపటి వరకు శాస్త్రవేత్తలు ఈ దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోయారు. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైనట్టు కే శివన్ వెల్లడించిన కొద్దిసేపటి తరువాత నరేంద్ర మోడీ శాస్త్రవేత్తల వద్దకు చేరుకున్నారు. వారిని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. వారిని ఓదార్చారు. ఊరడింపు మాటలు పలికారు. జీవితంలో ఉత్థాన పతనాలు అత్యంత సహజమని చెప్పారు. దీన్ని వైఫల్యంగా తీసుకోవద్దని సూచించారు.
#WATCH PM Narendra Modi at ISRO: There are ups and downs in life. This is not a small achievement. The nation is proud of you. Hope for the best. I congratulate you. You all have done a big service to nation, science and mankind. I am with you all the way, move forward bravely. pic.twitter.com/Iig1a8EuKD
— ANI (@ANI) September 6, 2019
ఇప్పటిదాకా చేసిన కృషి, ప్రయోగాలు అద్భుతమని ప్రశంసించారు. అయినప్పటికీ.. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఎనలేని కృషి చేశారని, అత్యుత్తమ సేవలను అందించారని చెప్పారు. ఎప్పటిలాగే తమ ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతుంటాయని భరోసా ఇచ్చారు. మరింత ధైర్యంగా ముందడుగు వేయాలని నరేంద్ర మోడీ వారిని ప్రోత్సహించారు.