ఆందోళన అవసరం లేదు: వాజపేయి ఆరోగ్యంపై హెల్త్ ఎయిమ్స్ బులెటిన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు గురువారం సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు. గడిచిన 48 గంటలలో వాజపేయి ఆరోగ్యం బాగా మెరుగుపడిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. మూత్రపిండం పనితీరు బాగుందన్నారు.
మూత్రవిసర్జన సాధారణ స్థాయికి చేరుకుందన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందని, శ్వాస బాగా తీసుకుంటున్నారని తెలిపారు. బీపీ, హార్ట్ బీట్ సాధారణంగా ఉన్నాయన్నారు. కొన్ని రోజుల్లో వాజపేయి పూర్తిగా కోలుకుంటారని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు.
వాజపేయి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్నారు. ఆరోగ్యంలో మంచి మెరుగుదల వచ్చిందని, రక్తపోటు, శ్వాసకోశ వ్యవస్థ, గుండె కొట్టుకోవడం సాధారణ స్థితిలో ఉన్నాయని వివరించారు. ఎలాంటి కృత్రిమ యంత్రాల మద్దతు తీసుకోవడంలేదని, రాబోయే కొన్ని రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారన్నారు. కాగా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 93ఏళ్ల వాజపేయి ఈ నెల 11న ఎయిమ్స్లో చేరారు.