ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: గో రక్షణ పేరిట దాడులపై సుప్రీం, కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గో సంరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలా దాడి చేయడం సరైనది కాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆవుల సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ కొందరు గో సంరక్షణ కార్యకర్తలు వ్యక్తులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. దీంతో ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
'భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలి. హింసను అనుమతించకూడదు. రక్షణ పేరుతో గుంపుగా దాడి చేయడం ఎంతమాత్రం సరికాదు. వీటిని అరికట్టడం రాష్ట్రాల బాధ్యత. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తయారుచేయాలి' అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో మోరల్ పోలీసింగ్కు చోటు లేదని తేల్చి చెప్పింది.
ఈ సందర్భంగా కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చూసేందుకు దేశంలోని ప్రతీ జిల్లాలో నోడల్ అధికారులను నియమించడం. హింసకు ప్రేరేపంచేలా ప్రసంగాలు, వీడియోలు ప్రసారం చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం లాంటి పలు సూచనలు చేసింది.