షాకింగ్ : 7 నెలల్లో ఏడుసార్లు.. బాలికను అమ్మేసిన వైనం.. మానసిక వికలాంగుడితో బలవంతపు పెళ్లి..
ఛత్తీస్గఢ్లో దారుణం వెలుుచూసింది. 18 ఏళ్ల ఓ యువతిని ఆమె దూరపు బంధువులు ఉద్యోగం పేరుతో మోసం చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి ఆమెను మరొకరికి అమ్మేశారు. అలా ఏడు నెలల కాలంలో ఆమె ఏడుగురి చేతులు మారింది. ఒక్కొక్కరు తమవద్ద కొన్ని రోజులు ఉంచుకోవడం ఆ తర్వాత అమ్మేయడం చేశారు. చివరకు బలవంతంగా ఓ మానసిక వికలాంగుడితో ఆమె పెళ్లి జరిపించారు. తన జీవితం నాశనమైపోయిందన్న బాధతో తీవ్రంగా కుమిలిపోయిన బాధితురాలు గతేడాది సెప్టెంబర్లో ఆత్మహత్యకు పాల్పడింది.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... ఛత్తీస్గఢ్లోని జష్పూర్కి చెందిన ఆ యువతి వ్యవసాయంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. మధ్యప్రదేశ్లో ఉండే వారి దూరపు బంధువులు పంచమ్ సింగ్ రాయ్,అతని భార్య గతేడాది ఓరోజు జష్పూర్కి వచ్చారు. యువతి ఇంటికి వెళ్లిన ఆ దంపతులు... ఊళ్లో వ్యవసాయ పనులేం చేస్తావ్... మాతో వస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని ఆమెకు ఆశజూపారు. తెలిసినవారే కావడంతో ఆ యువతితో పాటు తల్లిదండ్రులు కూడా వారి మాటలను నమ్మేశారు.
7 నెలల్లో ఏడుసార్లు....
అలా ఉద్యోగం పేరుతో ఆ యువతిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ఆ దంపతులు అత్యంత దారుణంగా వంచించారు. కేవలం రూ.20వేలకు కక్కుర్తి పడి ఛతార్పూర్కి చెందిన కల్లు రైక్వార్ అనే వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఆ వ్యక్తి ఆమెను తనవద్ద కొద్దిరోజులు ఉంచుకుని మరొకరికి అమ్మేశాడు. ఇలా మొత్తం ఏడు నెలల కాలంలో ఏడుసార్లు ఆమెను అమ్మేశారు. ఒక్కొక్కరు ఆమెను కొద్దిరోజులు ఉంచుకోవడం... ఆ తర్వాత డబ్బులకు ఇతరులకు అమ్మేయడం చేశారు.
మానసిక వికలాంగుడితో బలవంతపు పెళ్లి...
చివరిసారిగా ఉత్తర్ప్రదేశ్లోని లలిత్పూర్కి చెందిన సంతోష్ కుష్వాహా అనే వ్యక్తి రూ.70వేలతో ఆ యువతిని కొనుగోలు చేశాడు. ఆపై మానసిక వికలాంగుడైన తన కుమారుడు బబ్లూ కుష్వాహాతో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించాడు. తన జీవితం సర్వ నాశనమైపోయిందని భావించిన ఆ బాలిక బయటపడే మార్గం తెలియక తనలో తానే తీవ్రంగా కుమిలిపోయింది. చివరకు గతేడాది సెప్టెంబర్లో లలిత్పూర్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
కొనసాగుతున్న దర్యాప్తు
బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్లకు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో ఇంకా చాలామంది యువతులు ఇలాగే మోసాలకు గురవుతున్నట్లు అనుమానిస్తున్నారు. యువతులను అక్రమ రవాణా చేసే ముఠాలు పుట్టుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.