మనుషులేనా?: ఏనుగుపైకి మండుతున్న టైరు విసిరి ప్రాణం తీశారు(వీడియో)
చెన్నై: ఇటీవల కాలంలో కొందరు మనుషులు జంతువుల కన్నా క్రూరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువక ముందే.. తమిళనాడులో ఓ ఏనుగుకు మంట పెట్టి దాని ప్రాణం తీశారు. ఈ దారుణ ఘటన నీలగిరిస్ జిల్లాలోని మాసినగుడిలో చోటు చేసుకుంది.
Recommended Video
మండుతున్న రబ్బరు టైరును ఏనుగుపైకి విసిరారు..
అటుగా వచ్చిన ఏనుగును భయపెట్టేందుకు ఓ రెస్టారెంట్ యజమాని, సిబ్బంది మంటలు చూపించారు. ఆ తర్వాత మండుతున్న ఓ రబ్బరు టైరును ఏనుగు పైకి విసిరారు. భారీ మంటలతో ఎగిసిపడుతున్న ఆ టైరు.. ఏనుగు చెవికి తగిలి అక్కడే ఆగిపోయింది. దీంతో ఆ ఏనుగుకు మంటలు తగిలి భిగ్గరగా ఆరుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
తీవ్రగాయాలతో కుప్పకూలిపోయిన ఏనుగు
సమీపంలోని ఓ డ్యామ్ వద్ద తీవ్ర గాయాలపాలైన ఈ ఏనుగు అక్కడే పడివుంది. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఏనుగుకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. వైద్యులు వైద్యం అందించినప్పటికీ.. భారీగా రక్తస్రావం కావడంతో ఏనుగు ప్రాణాలు వదిలింది. 50 ఏళ్ల ఏనుగు ఈ మానవ మృగాల చేతిలో ప్రాణాలు వదిలిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. టైరు మంట తగిలి ఏనుగు చర్మం బాగా కాలిపోయిందని, ఆ గాయాలతోనే ఏనుగు మరణించిందని వైద్యులు తేల్చారు.
నిందితులను కఠినంగా శిక్షించాలంటూ..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రెస్టారెంట్ యజమాని రేమాండ్తోపాటు అతని దగ్గర పనిచేసే ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారిస్తున్నారు. కాగా, ఆ ఏనుగుపై నిందితులు మండుతున్న టైరును విసిరేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నిందితులపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి మనుషులను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా చూడాలని అంటున్నారు.