వాడికి ఉరే సరి.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..
హోషంగాబాద్ : దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తెచ్చినా అమలు కాకపోవడంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఓ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మృగానికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.
చాక్లెట్ ఆశచూపి
2018 అక్టోబర్ 30న పిపారియా ప్రాంతంలో ఓ ఐదేళ్ల చిన్నారి తన అన్నతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అది గమనించిన 22 ఏళ్ల దీపక్ అనే దుర్మార్గుడు ఆ చిన్నారిపై కన్నేశాడు. చాక్లెట్, ఫిడ్జెట్ స్పిన్నర్ ఆశ చూపి అమ్మాయిని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో చిన్నారిని హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే పొదల్లో పడేశాడు.
ఐదు రోజుల అనంతరం దొరికిన శవం
కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు హత్య జరిగిన ఐదు రోజుల అనంతరం నవంబర్ 4వ తేదీన చిన్నారి మృతదేహం పొదల్లో లభ్యమైంది. చిన్నారికి పోస్ట్మార్టం నిర్వహించగా రేప్ చేసి చంపినట్లు తేలింది.
మరణశిక్ష విధించిన కోర్టు
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో సదరు చిన్నారిని దీపక్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం వేట మొదలుపెట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి 350 కిలోమీటర్ల దూరంలోని బుర్హాన్పూర్లో కామాంధుడు ఉన్నట్లు తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. దాదాపు 8 నెలల పాటు సాగిన విచారణలో న్యాయమూర్తి 32మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హోషంగాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కేఎన్ సింగ్ సదరు మానవ మృగానికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.